గడ్డి కుంభకోణం: మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్కు చుక్కెదురు, బెయిల్ నిరాకరణ
రాంఛీ: గడ్డి కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్కు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. రెండు నెలల తర్వాత ఈ కేసులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
రూ. 900 కోట్ల గడ్డి కుంభకోణంకు సంబంధించిన మూడు కేసుల్లో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్కుబెయిల్ వచ్చింది. అయితే, డుమ్కా ట్రెజరీ కేసులో కూడా బెయిల్ వస్తే జైలు నుంచి విడుదల అవుతానని లాలూ ఆశించారు, కానీ, అలా జరగకపోవడంతో లాలూతోపాటు ఆర్జేడీ నేతలు నిరాశకు గురయ్యారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ మరో రెండు నెలలు వేచిచూడటం తప్ప చేసేదేం లేదు.
కాగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ బెయిల్ పిటిషన్పై విచారణను ఫిబ్రవరి 19 కి జార్ఖండ్ హైకోర్టు గత వారం వాయిదా వేసింది. ఈ కేసులు సీబీఐ ఏదైనా చెప్పాలనుకుంటే ఈ సమయంలో చెప్పవచ్చని తెలిపింది.
సీబీఐ తరపు న్యాయవాది సిన్హా మాట్లాడుతూ.. తాము వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమగ్రమైన పత్రాలు కోర్టు వద్ద లేనందున ఇప్పుడు వాదనలు ఆపడం సరికాదని లాలూ లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.
ఇప్పటికే తాను ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపారంటూ జనవరి 25న లాలూ తరపు న్యాయవాది కోర్టుకు వివరాలు తెలిపారు. దుమ్కా ట్రెజరీ వ్యవహారంలో తొందరగా విచారించాలని కోరారు. జనవరి 29న ఆ విన్నపాన్ని కోర్టు స్వీకరించింది. కాగా, లాలూ పలు ఆరోగ్య సమస్యలతో తరచూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత వారం క్రితం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో లాలూను ఢిల్లీ ఎయిమ్స్కు వాయుమార్గంలో తీసుకెళ్లి చికిత్స అందించారు.