ఆరోగ్యం బాగోలేకపోయినా..! కోర్టులో లొంగిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది మే నుంచి లాలూ పెరోల్పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ పెరోల్ పొడిగింపు కోసం చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దీంతో లాలూ కోర్టులో లొంగిపోయారు.
'నేను కోర్టు ఆదేశాలను అనుసరిస్తాను. నాకు ఆరోగ్య బాలేదు. కానీ హైకోర్టు తీర్పు పట్ల విశ్వాసం ఉంది' అని లాలూ వ్యాఖ్యానించారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 70ఏళ్ల లాలూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో మూడు నెలల పాటు పెరోల్ పొడిగించాలని జార్ఖండ్ హైకోర్టును కోరారు.
కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. ఆగస్టు 30వ తేదీన తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. లాలూకు కావాల్సిన వైద్య సహాయాన్ని జైలులోనే అందించాలని కోర్టు ప్రభుత్వానికి వెల్లడించింది. విచారణ సమయంలో పెరోల్ పొడిగింపును సీబీఐ వ్యతిరేకించింది. ఇప్పటికే ఆయన మూడు నెలల పెరోల్ తీసుకున్నారని, చికిత్స కూడా చేయించుకున్నారని తెలిపింది.