దాణా కుంభకోణం: నాలుగో కేసులో తీర్పు నేడే
రాంచీ : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై మరో కేసులో తీర్పు గురువారం వెలువడబోతోంది. స్పెషల్ సీబీఐ కోర్టు దాణా కుంభకోణంలోని నాలుగో కేసులో తీర్పు చెప్పబోతోంది.
1995 డిసెంబరు నుంచి 1996 జనవరి మధ్యలో డుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు మోసపూరితంగా ఉపసంహరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ ఈ నెల 5న ముగిసింది.
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్తోపాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, మరో 30 మంది నిందితులుగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసుల్లోని మొదటి కేసులో తీర్పు 2013లో వెలువడింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు ఐదేళ్ళ జైలు శిక్ష విధించారు.
2017 డిసెంబరు 23న రెండో కేసులో తీర్పు వెలువడింది. దీనిలో లాలూకు మూడున్నరేళ్ళ జైలు శిక్ష విధించారు. ఇక మూడో కేసులో తీర్పు ఈ ఏడాది జనవరి 24న వెలువడింది. దీనిలో ఆయనకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్పై రాంచీలో ఒక కేసు, పాట్నాలో మరొక కేసు విచారణలో ఉన్నాయి. నాలుగోదైన డుమ్కా ట్రెజరీ కేసులో విచారణ ఇప్పటికే ముగియడంతో గురువారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది.