జానపద గాయని సుష్మా హత్యోదంతంలో షాకింగ్ ట్విస్ట్: సహజీవనం చేసిన వాడే..!
లక్నో: ప్రముఖ జానపద కళాకారిణి, గాయని సుష్మా నేక్పూర్ హత్యోదంతంలో కొన్ని షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు బహిర్గతమౌతూ వస్తున్నాయి. సుష్మాను హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఆమె ప్రియుడేనని తేలింది. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన సుష్మా నేక్పూర్ ప్రియుడు.. ఆమెను వదిలించుకునే ప్రయత్నంలోనే హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె ప్రియుడితో మరో అయిదు మందిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్ కు తరలించారు.
సహజీవనం-బ్రేకప్: ప్రియురాలిని కత్తితో వెంటాడిన సీఈవో.. ఏం జరిగిందంటే
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుష్మా నేక్పూర్ ప్రముఖ జానపద గాయని. భోజ్ పురి భాషలో అనేక పాటలు పాడారు. గ్రామీణ యాసలో ఆమె పాడే పాటలంటే చాలా ఇష్టపడతారు ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు. లక్షలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. అవివాహితులరాలైన సుష్మా నేక్పూర్ కొన్నాళ్లుగా ఆమె గజేంద్ర భాటి అనే వ్యక్తితో కలిసి నివసిస్తున్నారు. సహజీవనం సాగిస్తున్నారు. కొంతకాలం కిందట గజేంద్ర భాటి వద్ద పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. సుష్మాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏ మాత్రం లేని గజేంద్ర.. ఆమెను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
సుష్మాను హత్య చేయడానికి సుపారీ ఇచ్చాడు. ఈ నెల 1వ తేదీన సుష్మాపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. గ్రేటర్ నోయిడాలో సుష్మా నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్లు సుష్మా శరీరంలోకి దూసుకెళ్లాయి. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. జానపద గాయనిగా ఆమెకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమబుద్ధ జిల్లా పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొనసాగించారు. అనుమానితులందర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలో- పోలీసులకు మొట్టమొదటగా అనుమానం వచ్చింది గజేంద్ర భాటిపైనే. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతణ్ని వెంటనే అరెస్టు చేయలేకపోయారు. కాాగా.. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సుష్మాపై కాల్పులు జరిపిన ఇద్దర్ని ముఖేష్, సందీప్ గా గుర్తించారు. మూడురోజుల తరువాత వారిని అరెస్టు చేశారు. దీనితో గజేంద్ర భాటి గుట్టు రట్టయింది. పెళ్లి కోసం ఒత్తిడి తీసుకొస్తున్న సుష్మా నేక్పూర్ ను వదిలించుకునే ప్రయత్నంలోనే ఆమెను హత్య చేయడానికి తమకు గజేంద్ర భాటి సుపారి ఇచ్చినట్లు ముఖేష్, సందీప్ అంగీకరించారు.
దీనితో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. సుష్మా హత్య కేసుకు సహకరించిన గజేంద్ర భాటి స్నేహితులు అమిత్, ప్రమోద్ కసానా, అజబ్ సింగ్ లను కూడా అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. సుష్మాను హత్య చేయడానికి గజేంద్ర భాటి ప్రయత్నించడం ఇది రెండోసారి. 2018లో తొలిసారిగా ఆమెను అంతమొందించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలించలేదు. రెండోసారి పక్కాగా స్కెచ్ వేయడంతో ఆమెను టార్గెట్ చేయగలిగాడని గౌతమబుద్ధ జిల్లా ఎస్పీ వైభవ్ కృష్ణ తెలిపారు.