వాహానాలు ఇష్టానుసారం పార్క్ చేసేవారికి షాక్..! నోపార్కింగ్ జోన్లో ఆపితే ఫైన్ రూ 23 వేలు..!!
ముంబై : నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇక అడ్డగోలుగా రోడ్లపై నిలిపే వాహనాలతో మరింత బేజారవుతున్నారు నగర ప్రజలు. అయితే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారిపై కొరడా ఝలిపించనున్నారు ముంబై అధికారులు. దాంతో అక్రమ పార్కింగ్ కారణంగా ఎక్కడా లేని ఇబ్బందులు పడుతున్న ముంబై ప్రజలకు కాసింత ఊరట లభించనుంది. ఇష్టారాజ్యంగా ఎక్కడంటే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసే వారికి కొత్త నిబంధనల ప్రకారం భారీ జరిమానాలు పడనున్నాయి.
ముంబైలోని 26 పబ్లిక్ పార్కింగ్ జోన్లలో కాకుండా వేరే చోట్ల వాహనాలు కనిపిస్తే చాలు ఇకపై కొరడా ఝలిపించనున్నారు. రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తున్నామని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జులై ఏడో తేది ఆదివారం నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి.
అవినీతి అక్రమాలు వద్దు.. పారదర్శకంగా సేవలు.. కొత్త అర్బన్ పాలసీపై కేసీఆర్ దిశానిర్దేశం
26 పార్కింగ్ జోన్లలో కాకుండా వాటికి 500 మీటర్ల లోపున అక్రమ పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనదారులకు 5 వేల రూపాయల నుంచి 8,300 వరకు, త్రీ వీలర్స్ వాహనాలకైతే 8 వేల రూపాయల నుంచి 12 వేల 200 వరకు పెనాల్టీ విధిస్తారు. లైట్ మోటార్ వాహనాలకైతే 10 వేల నుంచి 15 వేల వరకు, మీడియం వాహనాలకు 11 వేల నుంచి 17 వేలు చలాన్లు విధించనున్నారు. కార్లు తదితర ఫోర్ వీలర్ వాహనాలకు 10 వేల రూపాయల నుంచి 23 వేల 250 రూపాయల వరకు ఫైన్ వేయనున్నారు.
ముంబై మహా నగరంలో దాదాపు మూడు లక్షల వరకు వాహనాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. అయితే చలాన్ల విషయంలో మొదటగా తక్కువ మొత్తంలో విధిస్తున్నామని.. వాటిని చెల్లించే క్రమంలో వాహనదారులు ఎంత ఆలస్యం చేస్తే అంత పెనాల్టీ పెరుగుకుంటూ పోతుందని తెలిపారు.