నాకు హితబోధ చేసి మీరలా ఉన్నారేమిటి: మోడీకి మన్మోహన్ సింగ్ చురకలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గతంలో తనను మౌన్ మోహన్ సింగ్గా అభివర్ణించారని, మరి ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమిటని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం చురకలు అంటించారు. మాట తీరు మార్చుకోవాలని మోడీకి ఆయన సూచించారు. తనను మౌన్ మోహన్ సింగ్గా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేను మాట్లాడటం లేదని తనను మౌన్ మోహన్ సింగ్ అన్నారని, మాట్లాడటం నేర్చుకోవాలని సలహా ఇచ్చారని, ఇప్పుడు అదే సూత్రాన్ని మీరు పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు నాకు ఇచ్చిన సలహానే మీరు పాటించాలన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలపై మీరు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
ఉన్నావ్, కథువా అత్యాచారాల ఘటనపై ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. మీ ప్రభుత్వం కూడా మీ దారిలోనే నడుస్తోందన్నారు. నాకు చెప్పిన మాటలను ఇప్పుడు మీరు పాటించాలన్నారు. నన్ను నోరు విప్పాలని చెప్పారని, ఇప్పుడు మీకు నేను అదే చెబుతున్నానని సూచించారు.
నాకు మాటలు రావు అని చెప్పి మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అత్యాచారాల పైన మీరు ఇంత వరకు ఎందుకు స్పందించలేదన్నారు. మీకు త్వరలోనే జ్ఞానోదయం కలగాలన్నారు.
దేశంలో జరుగుతున్న పలు అరాచకాలపై నోరు మెదపాలని, మహిళలపై, పిల్లలపై జరుగుతున్న అరాచకాలకు మీరిచ్చే సమాధానం ఏమిటని మన్మోహన్ ప్రశ్నించారు. దీనిపై త్వరగా స్పందించకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందన్నారు.