భారత్ కు సవాలే: జనాభాకు అనుగుణంగా వసతుల కల్పన సంక్లిష్టం
అదనంగా పెరిగే 41 కోట్ల మందికి ఆహార వసతులు కల్పించడం ఎలాగన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ అంశంపై ఇప్పటి నుంచి దృష్టి సారిస్తే తప్పా సంకటంగా మారనున్న సమస్యను అధిగమించడం కష్ట సాధ్యమే మరి.
న్యూఢిల్లీ: మరో మూడు దశాబ్దాల కల్లా అంటే 2050 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం 129 కోట్లతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా భారత్.. 132 కోట్ల జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి భారత్ జనాభాలో తొలిస్థానంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
అసలు ఇప్పటికే భారత్ మొదటిస్థానంలో ఉన్నదని, 128 కోట్ల జనాభాతో చైనానే రెండో స్థానంలో ఉందన్న వాదన కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా అదనంగా పెరిగే 41 కోట్ల మందికి ఆహార వసతులు కల్పించడం ఎలాగన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ అంశంపై ఇప్పటి నుంచి దృష్టి సారిస్తే తప్పా సంకటంగా మారనున్న సమస్యను అధిగమించడం కష్ట సాధ్యమే మరి.
మరో 40 కోట్ల మందికి ఆహారాన్ని అందించాలంటే దేశంలో తృణ ధాన్యాల ఉత్పత్తి 4.6 శాతం పెరగాలని వృవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తవుతున్న తృణ ధాన్యాలు రెట్టింపు కావాలి. రోజు రోజుకు సాగు భూములు తరగిపోతున్న నేపథ్యంలో అధిగ దిగుబడి ఒక్కటే మార్గం. ఆ అధిక దిగుబడికి ఏం చేయాలన్నది కీలక ప్రశ్న. పాశ్చాత్య దేశాల్లో లాగా కాకుండా భారత్ ఇప్పటికే వ్యవసాయాధారిత దేశమే.
దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో కూడా వ్యయసాయ ఉత్పత్తులే 18 శాతం ఆక్రమిస్తున్నాయి. అయితే 50 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి కల్పించింది. 2010 - 11 జనగణన ప్రకారం భారతదేశంలో 11.89 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఇది దేశంలో పనిచేస్తున్న కార్మికుల్లో 24.6 శాతం అన్నమాట. దేశవ్యాప్తంగా కార్మికులు 4.81 కోట్ల మంది. దీనికి 1.44 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు అదనం. గమ్మత్తేమిటంటే పాలకులు సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి ఆర్థిక వ్యవస్థలో సాధారణ ప్రాధాన్యం ఇవ్వడమే ఇబ్బందికర పరిణామం.
జల వనరుల పెంపుతోనే సౌభాగ్యం
2000 - 01 జనగణన ప్రకారం దేశంలో 5.81 కోట్ల హెక్టార్ల భూమి మాత్రమే సాగైంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి దేశంలో 16 కోట్ల హెక్టార్లు ఉంది. అంటే ఇంకా మూడింతలు వ్యవసాయాన్ని పెంచవచ్చన్న మాట. వాటికి జల వనరులు అవసరం. ఇప్పటివరకు 62 శాతం వరకూ పంటల సాగు భూగర్భ జలాలపైనే ఆధారపడి సాగుతోంది. కనుక భూగర్భ జల వనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 2010 చివరి నాటికి 1.01 కోట్ల హెక్టార్లు భారీ, 1.13 కోట్ల హెక్టార్ల భూములు భూగర్భ జలాలు, చిన్న రిజర్వాయర్లు, చెరువులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. జల వనరులు అందుబాటులో లేకే ఎక్కువ భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దేశంలో చాలా కాలం నుంచి భూ- వ్యవసాయ సంస్కరణలు చోటు చేసుకోక పేద, సన్నకారు, మధ్యకారు రైతులే ఎక్కువ ఉన్నారు. మరోవైపు శరవేగంగా జనాభా పెరుగుతుంటే.. పంటలు సాగుచేసే భూ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. 1960 నుంచి ప్రతి 15 ఏళ్లకోసారి సగటున సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నది. హరిత విప్లవం తర్వాత భారీగా ఆహార ధాన్య నిల్వలు పేరుకుపోయిన ఘటనలు అనేకం.
టెక్నాలజీ వినియోగంతో పంటల సాగు పెంపు ఇలా
2000 - 01 జనగణన ప్రకారం ప్రతి ఒక్కరికి 181 కిలోల త్రుణ ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. 2020 నాటికి 215 కిలోలు అవసరమని పరిస్థితులు చెప్తున్నాయి. ఆదాయాలు పెరిగినా కొద్దీ వినియోగం కూడా పెరుగుతుంది కనుక తదనుగుణంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. మాంసం, కోడిగుడ్లు నాలుగు రెట్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, పాల ఉత్పత్తులు ఐదు రెట్లు పెరగాలి. మాంసం, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్లతోపాటు పలు సమస్యలు పెనవేసుకున్నాయి. ఆధునిక డెయిరీ, పాడి గేదెలకు భారీ స్థాయిలో త్రుణ ధాన్యాలు, నూనె గింజలు దాణాగా పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఆమోదయోగ్యంగా రసాయన ఎరువులను వాడటంతోపాటు సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగిస్తే పంటల దిగుబడి పెంచ వచ్చు. త్రుణ ధాన్యాలు 2020 నాటికి 260 మిలియన్ టన్నుల వరకు చేయొచ్చు. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులు దిగుబడి పెంచేందుకు ఆధునిక వ్యవసాయం చేయలేరు. సహకార వ్యవసాయం అన్నది మన దేశంలో ఎక్కడోగాని లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. తదనుగుణంగా అవసరమైతే భూ సంస్కరణలు తేవాలి. దిగుబడిని పెంచేందుకు కొత్త దారులు అన్వేషించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
భారత్, చైనాల సరసన నైజీరియా, కాంగో
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 1950లో 250 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా ప్రస్తుతం దాదాపు 750 కోట్లుగా ఉన్నది. 2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు పెరుగుతుంది. ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుమోసిన చైనా అప్పటికి రెండో స్థానంలో ఉంటుంది. తొలి స్థానంలోకి భారతదేశం వస్తుంది. చైనా, భారత్ తర్వాత జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్న దేశం నైజీరియా. 1950లో 3.7 కోట్లు ఉన్న నైజీరియా జనాభా 2015 నాటికి 18.20 కోట్లకు చేరుకుంది. 2050 నాటికి భారత్, చైనా దేశాల తర్వాత నైజీరియా ఉంటుందని అంచనా. వీటితోపాటు కాంగో జనాభా కూడా త్వరత్వరగా పెరుగుతోంది. 1950లో 1.2 కోట్ల మంది గల కాంగో జనాభా 2050 నాటికి 23 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వర్ధమాన దేశాల్లో ఒక్కటైన బ్రెజిల్ జనాభా వేగంగా తగ్గిపోతూ వృద్ధుల జనాభా పెరుగుతుంటుంది. ఇక 1950లో ఐరోపా దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ జనాభా అధికం. కానీ ఇప్పుడు జనాభా అధికంగా కల మొదటి పది దేశాల్లో వీటికి స్థానం లేదు. ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న రష్యా 2040 నాటికే ఆ స్థానాన్ని కోల్పోతుంది.
ఉపాధి అవకాశాల పెంపుపైనే భవితవ్యం
అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం 2022 నుంచి 2025 మధ్య చైనా జనాభాను భారతదేశం అధిగమిస్తుంది. భారతదేశ జనాభా 2050 నాటికి దాదాపు 170 కోట్లకు చేరుకొని స్థిరపడి, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జనాభా పెరుగుదల ఉండదు. 2080 తర్వాత జనాభా తగ్గుదల మొదలై 2100 నాటికి 150 కోట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే క్షీణించింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. అధిక జనాభా వల్ల భారతదేశంలో విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాల కల్పన పెద్ద సవాలుగా మారుతుంది. మహిళలకు అధికంగా ఉద్యోగాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి వస్తుంది.