శశికళ ఎఫెక్ట్: వస్తే తిరిగెళ్లవ్.. నటుడికి సొంత ఇలాకాలో వార్నింగ్
అన్నాడీఎంకే ఎమ్మెల్యే, నటుడు కరుణాస్కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. జనాలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు చెప్పులు విసిరారు.
చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యే, నటుడు కరుణాస్కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. జనాలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు చెప్పులు విసిరారు. మరోసారి ఇక్కడకు వస్తే తిరిగి వెళ్లవని హెచ్చరికలు జారీ చేశారు.
స్థానికుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని ఆయనను అక్కడి నుంచి తీసుకు రావాల్సి వచ్చింది. అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి.. తిరువాడనై అన్నాడీఎంకే ఎమ్మెల్యే, హాస్యనటుడు కరుణాస్ మద్దతు పలికారు.
చావడం మేలు: శశికళపై కట్జూ తీవ్రవ్యాఖ్యలు, జయలలితపై డీఎంకే
ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే చాలని, ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని కరుణాస్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో తీవ్రస్థాయిలో ఆయనను వ్యతిరేకిస్తూ ప్రచారం కూడా జరిగింది.
ఈ విషయమై గురువారం గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కరుణాస్ శుక్రవారం తన నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. అదే విధంగా తిరువాడనైకు వెళ్లిన కరుణాస్ అక్కడి ఓ బస్టాండు వద్దకు చేరుకున్నారు.
కరుణాస్ను చుట్టుముట్టి నినాదాలు
అప్పటికే కరుణాస్ రాక కోసం ఎదురుచూస్తున్న కొందరు నిరసనకారులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టి వ్యతిరేక నినాదాలు చేశారు. నియోజకవర్గం ప్రజల మనోభావాలను గౌరవించకుండా శశికళ వర్గానికి మద్దతునిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కలకలం చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
రంగంలోకి పోలీసులు
నిరసనకారులతో చర్చలు జరిపి పోలీసు భద్రతతో అక్కడి నుంచి కరుణాస్ను వెనక్కు పంపించడానికి చర్యలు చేపట్టారు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలోకి రావద్దని, వస్తే తిరిగి వెళ్లవంటూ పలువురు నిరసనకారులు ఆక్రోశించారు. ఎట్టకేలకు నిరసనకారులను పోలీసులు శాంతింపచేసి అక్కడి నుంచి కరుణాస్ను సురక్షితంగా వెనక్కు పంపారు.
శశికళకు మద్దతు పలకడంతో ఆగ్రహం
కరుణాస్.. శశికళకు మద్దతు పలకడంపై సోషల్ మీడియాలో రకరకలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల 22వ తేదీన కరుణాస్ పుట్టిన రోజు సందర్భంగా విమర్శలు ఎక్కువయ్యాయి. కరుణాస్ ఫోటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లు కొందరు పోస్టర్లు రూపొందించారు. ఆ పోస్టర్లను గోడలపై అంటించారు.
పోలీసులకు కరుణాస్ ఫిర్యాదు
ఈ పరిణామాలపై కలత చెందిన కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి అంజలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు చూసి తన భార్య తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురైందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని చెప్పారు.
కించపరుస్తున్నారు
భావస్వాతంత్ర్యం పేరుతో తనను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని కరుణాస్ మండిపడ్డారు. తాను పోటీ చేసి గెలిచిన తిరువాడాళై నియోజకవర్గంలో 2,86,644 ఓటర్లు ఉన్నారని, అందులో తనకు వచ్చిన ఓట్లు 76వేలకు పైగా ఉన్నాయని, తన గెలుపును వ్యతిరేకించిన వారి సంఖ్య లక్షా 15వేల చిలుకు ఉందని, ఓటు హక్కును వినియోగించుకోని వారు 80వేల మంది వరకు ఉన్నారని, మొత్తంగా అన్నాడీఎంకేకు రెండు లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.
శిక్షించండి
తనను కించపరిచే విధంగా విమర్శలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, దీపా పేరవైకి చెందిన కొందరు కార్యకర్తలు కరుణాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.