30 ఏళ్లుగా ముస్లిం ఎంపీలే లేరు..! ఆ స్టేట్ మొత్తం అంతేనా?
అహ్మదాబాద్ : 30 ఏళ్ల నుంచి గుజరాత్ లో ముస్లిం మైనార్టీ ఎంపీలే లేరు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ముప్పై సంవత్సరాలలో ఈ స్టేట్ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడం లేదు. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ హవా కొనసాగినా.. 1989 నుంచి మాత్రం ఏ ఒక్కరూ కూడా ఎంపీగా ఎన్నిక కాలేదు.
1962, 1977లో హవా.. తర్వాత ఏమైంది..?
గుజరాత్ లో ముస్లింల జనాభా చూసినట్లయితే 9.5 శాతంగా ఉంది. 1962లో బన్సకాంత సెగ్మెంట్ నుంచి ముస్లిం లీడర్ జోహ్ర చావ్డా గెలిచారు. అలాగే 1977లో బరుచ్ నుంచి అహ్మద్ పటేల్, అహ్మదాబాద్ నుంచి యోహ్సన్ జఫ్రి గెలిచారు. బరుచ్ లోక్సభ సెగ్మెంట్ నుంచి 1977లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందిన అహ్మద్ పటేల్.. 1982, 1984 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
1989 నుంచి ఇప్పటిదాకా..!
1989 నుంచి మాత్రం బరుచ్ లోక్సభ సెగ్మెంట్ లో ఇంతవరకు ఎవరూ గెలవలేదు. 1989 ఎన్నికల్లో అహ్మద్ పటేల్ పై బీజేపీ అభ్యర్థి చందు దేశ్ముఖ్ విజయం సాధించారు. వాస్తవానికి ఈ లోక్సభ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అత్యధికంగా 22.2 శాతం ఓటుబ్యాంకుతో 15 లక్షల 64 వేల ఓటర్లు ఉన్నారు. అయినా కూడా 1989 నుంచి ఇక్కడ ముస్లిం అభ్యర్థులు విజయం సాధించలేకపోతున్నారు.
2014లో 67 మంది పోటీ.. ఒక్కరైనా గెలిచారా?
1989 నుంచి 2014 వరకు గుజరాత్ స్టేట్ నుంచి ఏడుగురు ముస్లిం అభ్యర్థులు పార్లమెంటరీ ఎన్నికల్లో తలపడ్డారు. కానీ ఏ ఒక్కరూ గెలిచిన దాఖలాలు లేవు. 2014 ఎంపీ ఎన్నికల్లో చూసినట్లయితే.. రాష్ట్రవ్యాప్తంగా 334 మంది అభ్యర్థులు పోటీపడగా అందులో 67 మంది ముస్లిం అభ్యర్థులు కాంటెస్ట్ చేశారు. అందులో విచిత్రమేంటంటే కాంగ్రెస్ తరపున ఒక్కరు మాత్రమే పోటీ చేశారు. మిగతా 66 మంది ఇతర పార్టీల నుంచి కొందరు.. ఇండిపెండెంట్లుగా కొందరు బరిలో నిలిచారు.