టికెట్ల కేటాయింపులో వారసులకే ప్రాధాన్యం
పాట్నా : వారసత్వ రాజకీయాలకు దూరమంటూ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆచరణలోకి వచ్చే సరికి రాజకీయపార్టీలన్నీ ఒకే బాటలో నడుస్తున్నాయి.తాజాగా బీహార్లో ఎన్డీఏ పక్షాలు ప్రకటించిన లిస్టు చూస్తే ఇదే అర్థమవుతుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని నాయకులు తమ కుటుంబసభ్యులు, సన్నిహితులకే టికెట్లు ఇచ్చుకున్నారు.
ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు
12 స్థానాల్లో వారసుల పోటీ
బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలుండగా.. బీజేపీ, ఎల్జేపీ, జేడీయూలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు 39 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. టికెట్లు పొందిన వారిలో 12 మంది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం. ఆయా పార్టీలకు చెందిన నేతలు తమ వారసులు, కుటుంబసభ్యులు, సన్నిహితులకు టికెట్లు ఇచ్చుకుని, చెప్పేందుకే నీతులు తప్ప పాటించేందుకుకావని నిరూపించాయి.
పాశ్వాన్ కుటుంబానికి ఐదు టికెట్లు
బీహార్లో ఎన్డీఏ కూటమిలో ఒకటైన ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలుపుకుని మొత్తం ఐదుగురికి టికెట్లు ఇచ్చుకున్నారు. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ జుమై నుంచి పోటీ చేస్తుండగా, తమ్ముడు పశుపతి కుమార్ హాజీపూర్ నుంచి, మరో సోదరుడు రామ్ చంద్ర పాశ్వాన్ సమస్తీపూర్ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇక మిగిలిన రెండు సీట్లను ఎల్జేపీ అధినేత తన సన్నిహితులైన వీణాదేవీ, చందన్ కుమార్ లకు ఇచ్చారు.
బీజేపీలోనూ రాజకీయ వారసులు
బీజేపీ కూడా టికెట్ల కేటాయింపులో రాజకీయ వారసత్వం కలిగిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేస్తుండగా.. వెస్ట్ చంపారన్ నుంచి సంజయ్ జైశ్వాల్, ముజఫర్ నగర్ అభ్యర్థికి అజయ్ నిషాద్, మధుబని నుంచి సుశీల్ అశోక్ యాదవ్, ఔరంగాబాద్ నుంచి సుశీల్ సింగ్, షియోహర్ నుంచి రమాదేవి బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. వీరందరికీ వారి కుటుంబ రాజకీయ నేపథ్యమే టికెట్లు ఇచ్చేందుకు కారణం.
జేడీయూ నుంచి ఒకరు
జేడీయూ నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే కవిత సింగ్ కూడా రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తే కావడం విశేషం. జేడీయూ నేత జగ్మాతో దేవి కోడలైన కవిత సింగ్, సివాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.