నరేంద్ర మోడీ బయోపిక్: డాక్యుమెంటరీ ఫిలిం కోసం పాత రైలు బోగీ తగులబెట్టారు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డాక్యుమెంటరీ కోసం ఓ పాత రైలును తగులబెట్టారు. ప్రధానిపై ఓ డాక్యుమెంటరీ తీస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం నాడు ఓ పాత రైల్వే కోచ్ను తగులబెట్టారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో గోద్రా అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
దీనికోసం ఓ మాక్ డ్రిల్ బోగీని వాడినట్లు వెస్టర్న్ రైల్వే అధికారి తెలిపారు. నిజానికి చిత్రీకరణ తర్వాత దానిని అలాగే తిరిగివ్వాలని చెప్పామని, డాక్యుమెంటరీ యూనిట్ మాత్రం దానిని తగులబెట్టారని చెప్పారు.
ఇది ఉపయోగించకుండా పక్కన పడేసిన మాక్ డ్రిల్ బోగీ అని, దీనిని అలాగే తిరిగివ్వాలన్న నిబంధనతో చిత్రీకరణ కోసం ఇచ్చామని, ఈ రైలు బోగీని ఉపయోగించినందుకు అద్దె వసూలు చేశామని అని వదోదర రైల్వే డివిజన్ అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రతాప్నగర్ స్టేషన్లో కోచ్ కేర్ సెంటర్ దగ్గర ప్రత్యేకంగా సెట్ వేసి ఈ గోద్రా సీన్ను చిత్రీకరించినట్లు డాక్యుమెంటరీ డైరెక్టర్ ఉమేష్ శుక్లా తెలిపారు. 4 రోజుల పాటు ఈ స్టేషన్లో షూటింగ్కు అనుమతిని ఇచ్చారు. 2002, ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా రైలు ప్రమాదంలో 59 మంది కరసేవకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీని తర్వాత రాష్ట్రంలో మత కలహాలు చెలరేగాయి.