వేర్పాటువాదులకు తండ్రిలా సీఎం ముఫ్తీ వ్వవహరిస్తున్నారు: శివసేన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్పై శివసేన పార్టీ తీవ్ర ఆరోపణలకు చేసింది. "ఆయన (ముఫ్తీ మహ్మద్ సయీద్) తీవ్రవాదులకు తండ్రిలాంటి వ్యక్తిగా ఉంటున్నారు" అని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.
తీవ్రవాదులకు సహాయం చేయడం రాజద్రోహం లాంటిదని, వారిపై ముఫ్తీ చర్యలు తీసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్కి చెందిన వేర్పాటువాది మసరాత్ ఆలంను పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో పాకిస్ధాన్ రాయబారి అబ్దుల్ బాసిత్కు, వేర్పాటువాద నేత సయ్యద్ ఆలీ షా జిలానీ మధ్య చర్చలు జరిగిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.
ఈ చర్చల ప్రేరణతోనే ముప్తీ, ఆలం విడుదలపై నిర్ణయం తీసుకొన్నారని ఆరోపణలు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశ శ్రేయస్సుకు ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొంది. మీకు కావాల్సింది చేయండి, కానీ దేశాన్ని మాత్రం ఇబ్బందులకు గురి చేయకండి. దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ క్రైమ్లో పాలుపంచుకోకండని సూచించింది.
వేర్పాటువాది మసరాత్ ఆలంను విడుదల చేయడం టెర్రరిస్టులకు సాయం చేసినట్లేనని పేర్కొంది. కాబట్టి, మసరాత్ ఆలంను అరెస్టు చేసి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా జమ్మూ సీఎం ముప్తీకి శివసేన సూచించింది. వేర్పాటువాది మసరత్ ఆలం విడుదలపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చిన నేపథ్యంలో కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత నిర్మల్ సింగ్తో మంగళవారం న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్షాతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో పరిస్థితిపై ఆయనతో చర్చించారు. అనంతరం ‘‘మిలిటెంట్లు, వేర్పాటువాదుల విడుదలపై ఏకపక్ష నిర్ణయాలు ఇక సహించం. అధికారం మాకెంత మాత్రం ముఖ్యం కాదు'' అంటూ క్లుప్తంగా, కఠినంగా అధిష్ఠానం పీడీపీకి హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వ్యాఖ్యలతో దిగొచ్చిన పీడీపీ ఆలం విషయంలో ప్రజా రక్షణ చట్టాన్ని(పీఎస్ఏ) మళ్లీ ప్రయోగించే వీలు లేనందువల్లే అతడు విడుదలైనట్లు సురేష్కుమార్ చెప్పారు. సుప్రీం తీర్పు ప్రకారం ఈ చట్టంకింద ఎవరినైనా గరిష్ఠంగా ఆరు నెలలు నిర్బంధించవచ్చునని, అటుపైన ఒకసారి మాత్రమే పొడిగించే వీలుంటుందని వివరించారు. మళ్లీ అరెస్టు చేయాలంటే తాజా ఆరోపణలుంటేనే సాధ్యమని అన్నారు.