'లాడెన్ వంటి వారు చస్తే సోనియా రాత్రంతా ఏడుస్తారు'
న్యూఢిల్లీ: తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ వంటి వారి కోసం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాత్రంతా ఏడుస్తారని కేంద్రమంత్రి, బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆదివారం అన్నారు. లాడెన్ వంటి తీవ్రవాదులు చనిపోతే సోనియా వంటి వారు రాత్రంతా ఏడుస్తారని ఎద్దేవా చేశారు.
వారికి నిద్ర కూడా పట్టదన్నారు. ఓ తీవ్రవాదిని చంపినా, దానిని ఆమె మతానికి ముడిపెడుతున్నారని ధ్వజమెత్తారు. నక్వీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి దుమారాన్ని రేపుతున్నాయి. నక్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.
ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో డిమాండ్ చేశారు. నక్వీ తన పాపులారిటీ కోసమే ఈ తరహాలో మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీ సీనియర్ నేతను విమర్శిస్తే, పత్రికల్లో ఫోటో చూసుకోవచ్చని ఆయన భావిస్తున్నాడన్నారు. తానేమీ తన సొంత మాటలు చెప్పలేదని, గతంలో కాంగ్రెస్ నేత ఒకరు సోనియా గాంధీ పైన చేసిన వ్యాఖ్యలనే గుర్తు చేసుకున్నానని నక్వీ కౌంటర్ ఇచ్చారు.
బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో టెర్రరిస్టులు చనిపోతే సోనియా గాంధీ రాత్రంతా ఏడ్చారని, నిద్రకూడా పోలేదని గతంలో ఓ కాంగ్రెస్ నేత చెప్పారని నక్వీ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత చెప్పిన వ్యాఖ్యలనే నేను చెబితే, వివాదాస్పదం ఎలా అవుతుందన్నారు.