డబుల్ ధమాకా: ఈ తల్లీ కూతుళ్లు చరిత్ర సృష్టించారు...ఎందులో తెలుసా..?
ఢిల్లీ: ఒకరి వయస్సు 56 ఏళ్లు... మరొకరి వయస్సు 28 ఏళ్లు. అయినా ఇద్దరూ పోటీ పడి చదివారు. ఇద్దరికీ ఒకేరోజు పీహెచ్డీ పట్టా వచ్చింది. పోటీ పడి చదివిని ఈ ఇద్దరు ఎవరు... పీహెచ్డీ రావడం వెనక అసలు కథ ఏమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఒకే రోజు పీహెచ్డీ పూర్తి చేసిన తల్లీ కూతుళ్లు
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరి మహిళల పేర్లు మాలా దత్తా, శ్రేయా మిశ్రా. ఒకరి వయస్సు 56 ఏళ్లు ఉండగా మరొకరి వయస్సు సరిగ్గా అందులో సగం అంటే 28 ఏళ్లు . ఇంతకీ వీరిద్దరు ఎవరనేగా మీడౌటు అక్కడికే వస్తున్నాం. ఈ ఇద్దరూ తల్లీ కూతుళ్లు. ఇద్దరికీ చదువంటే ప్రాణం. తల్లి మాలాదత్తా కాలేజీ చదువులు పూర్తి చేసి దాదాపు 34 ఏళ్లు అవుతోంది. అయితేనేం చదవాలన్న కోరిక ఆమెను విడనాడలేదు. 34 ఏళ్ల తర్వాత పీహెచ్డీ డిగ్రీ పొందింది. ఇది ఇలా ఉంటే... ఆమెకు మరో సంతోషాన్నిచ్చే వార్త ఏమిటంటే తన కూతురు కూడా పీహెచ్డీ చేసి ఇద్దరూ ఒకే రోజున ఒకే యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ డిగ్రీని పొందారు.
రక్షణశాఖలో మాలాదత్త, ప్రపంచబ్యాంకులో శ్రేయా మిశ్రా
మాలా దత్త రక్షణశాఖ కార్యాలయంలో భారత ఆర్థిక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1985లో మాలా దత్తా ఆర్థిక శాస్త్రంలో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఇక అప్పటి నుంచి ఆమెకు పీహెచ్డీ చేయాలనే కోరిక బలంగా నాటుకుపోయిందని చెప్పారు. ఇక తన చిన్న కూతురుకు ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉన్నకారణంగా తాను తన ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అదేసమయంలో ఫైనాన్స్లో పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రక్షణశాఖ నుంచి సెలవు తీసుకుని పీహెచ్డీ కోసం కష్టపడి చదివినట్లు చెప్పారు. ఇక శ్రేయా ప్రపంచబ్యాంకులో కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఆమె మాస్టర్స్ పూర్తయిన రెండేళ్లకు ఢిల్లీ యూనివర్శిటీలో పీహెచ్డీకి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తన తల్లి, తాను ఇద్దరూ ఒకేసారి పీహెచ్డీని పూర్తి చేసి దాన్నొక మధుర జ్ఞాపకంగా జీవితాంతం ఉంచుకోవాలని భావించినట్లు శ్రేయా చెప్పారు.ఇద్దరి సబ్జెక్టులు వేరయినప్పటికీ తన తల్లి గైడెన్స్ తీసుకున్నట్లు శ్రేయా చెప్పారు. ఇద్దరు కలిసి చదివి మూడేళ్లలో పీహెచ్డీ పూర్తి చేసినట్లు చెప్పారు.
అన్నదమ్ముల అనుబంధం: అనిల్ అంబానీ జైలుకెళ్లకుండా ఆదుకున్న రక్తసంబంధం
యూనివర్శిటీ చరిత్రలో ఇది తొలిసారి
తన కూతరు వయస్సు ఉన్న వారి పక్కన కూర్చుని క్లాసులకు హాజరవడం తనకు ఎంతో సంతోషాన్ని కలగజేసిందని తల్లి మాలాదత్తా అన్నారు. కొన్ని సార్లు తన ప్రొఫెసర్ ఆమెను మేడం అని పిలిచేవారని చెప్పారు. ప్రొఫెసర్ అలా పిలిచినప్పుడు తనకు ఏదో తెలియని ఆనందం ఉండేదని మాలా చెప్పారు. ఇక తల్లీ కూతుళ్లు ఇద్దరూ తమ థీసిస్ను సబ్మిట్ చేసి ఒకే రోజు పీహెచ్డీ పట్టా పొందారు. అయితే గతేడాది నవంబర్ 19నే ఇద్దరూ పీహెచ్డీ డిగ్రీ పట్టా పొందాల్సి ఉన్నప్పటికీ శ్రేయా వివాహం ఉండటంతో అది సాధ్యపడలేదు. అయితే మార్చి 15న ఇద్దరూ యూనివర్శిటీకి వెళ్లి డిగ్రీ పట్టాను తెచ్చుకున్నారు. తమ కలను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు తమ యూనివర్శిటీ చరిత్రలో తల్లీ కూతుళ్లు ఒకే రోజు పీహెచ్డీ పట్టాలు పొందడం తొలిసారని అక్కడి అధికారులు తెలిపారు.