రిలయన్స్ చరిత్రలో తొలిసారి: ఆపదవికి అంబానీ కుటుంబం నుంచి కాకుండా ఇంకెవరు ..?
ముంబై: ఒక కంపెనీకి ఛైర్మెన్ మరియు ఎండీలు వేర్వేరు వ్యక్తులు ఉండాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా గతంలో సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఎండీగా ఎవరు ఉంటారా అనే ప్రశ్న సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర అంశాలు తెరపైకొస్తున్నాయి.
అంబానీ కుటుంబం నుంచి కాకుండా మరెవరు?
సెబీ సూచించిన నిబంధనలను అమలు చేయాల్సి వస్తే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఉన్న ముఖేష్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్గా వ్యవహరిస్తారు. అంబానీ కుటుంబం నుంచి కాకుండా మరొకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీగా వ్యవహరిస్తారు. ఇదే జరిగితే రిలయన్స్ చరిత్రలో అంబానీ కుటుంబం నుంచి కాకుండా మరొకరు ఈ కీలక బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి అవుతుంది.
ఎండీ పోస్టుకు ప్రచారంలో నిఖిల్ మెస్వానీ పేరు
ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఎండీ పోస్టుకు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న నిఖిల్ మెస్వానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇతనితో పాటు ముఖేష్ అంబానీకి కుడిభుజంగా వ్యవహరిస్తూ సంస్థకు వర్చువల్ సీఈఓలా ఉన్న మనోజ్ మోడీ పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు నిఖిల్ సోదరులు హితల్ మరియు పీఎంఎస్ ప్రసాద్లు కూడా ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నారు.
ఎవరు ఈ నిఖిల్ మెస్వానీ
90వ దశకం నుంచే నిఖిల్ మెస్వాని రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో ప్రయాణిస్తున్నారు. వీరు ముఖేష్ అంబానీకి బంధువులు కూడా. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించినప్పుడు నిఖిల్ మెస్వానీ తండ్రి రసిక్లాల్ మెస్వాని కూడా ఒక ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో మనోజ్ మోడీ అధికారికంగా లేనప్పటికీ రిలయన్స్ సంస్థ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు.
సెబీ చెబుతున్న నిబంధనలు ఏమిటి..?
లిస్టెడ్ కంపెనీలకు ఛైర్మెన్లు ఎండీలు వేర్వేరుగా ఉండాలని సెబీ నిబంధనలను తీసుకొచ్చింది. అంటే ఒకే కుటుంబానికి చెందిన వారు లేదా బంధువులు ఎండీ పదవులు చేపట్టరాదని సూచించింది. 1956 కంపెనీస్ చట్టంలోని సెక్షన్ 6లో బంధువుల కింద ఎవరెవరు వస్తారో స్పష్టమైన నిర్వచనం ఉంది. దీన్ని అనుసరించే నిబంధనలను ఫిక్స్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఇందులో దాయుదుల ఉండరాదని ఎక్కడా పేర్కొనలేదు. అంటే నిఖిల్ మెస్వానీ అంబానీకి దాయాది వరస అవుతారు. రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ముందుగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పేర్ల తర్వాత హితత్ మెస్వానీ పేర్లున్నాయి.
చక్కర్లు కొడుతోన్న హితల్ మెస్వానీ పేరు
1990లో హితల్ మెస్వానీ రిలయన్స్ సంస్థలో చేరారు. అనంతరం 1995 ఆగష్టు 4న ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ మానుఫాక్చరింగ్తో పాటు పలు సంస్థలను ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. రిలయన్స్ వృద్ధిలో హితల్ కీలకంగా వ్యవహరించారు. మెగా ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే జరిగాయి.