భారత చరిత్రలోనే తొలిసారి .. భారత్ - పాక్ ఎల్ఓసీ వద్ద విధుల్లో మహిళా సైన్యం
భారతదేశ సైనిక చరిత్రలోనే మొదటిసారిగా భారత్-పాక్ సరిహద్దుల నియంత్రణ రేఖ వెంట మహిళా సైనికులను రంగంలోకి దింపింది భారత సైన్యం. జమ్మూకాశ్మీర్లో తొలిసారిగా రైఫిల్ విమెన్ దేశ భద్రతా విధుల్లోకి దిగడం ఒక చారిత్రక ఘట్టం. భారత్ పాక్ ల మధ్య సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ ప్రాంతంలో భద్రతా విధుల్లో మహిళలు మోహరించడం కత్తి మీద సామే అయినా, భారత సైన్యం 'రైఫిల్ విమెన్' ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారని వారికి అప్పగించింది.
Recommended Video
సాధన పాస్ ద్వారా ఎల్ఓసి వైపు వెళ్లే రహదారిపై మహిళా సైన్యం
సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో సాధన పాస్ ద్వారా ఎల్ఓసి వైపు వెళ్లే రహదారిపై విధుల్లో మహిళా అధికారి నేతృత్వంలోనే సాయుధ మహిళా బృందాన్ని నియమించామని, వారు దేశ రక్షణకు పహారా కాస్తున్నారు అని భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్తో నియంత్రణ రేఖకు సమీపంలో అంతర్గత భద్రత మరియు పోరాట విధుల కోసం భారత సైన్యం మహిళా సైనికులను నియమించడం భారతీయ మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
అస్సాం రైఫిల్స్కు చెందిన మహిళా సైన్యం .. డిప్యుటేషన్ పై ఇండియన్ ఆర్మీలోకి
ఈ మహిళా ప్లాటూన్ పారా మిలిటరీ ఫోర్స్ అస్సాం రైఫిల్స్కు చెందినదని, ఈ మహిళా సైనికులు భారత సైన్యంలో డిప్యుటేషన్పై చేరారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర కాశ్మీర్లోని టాంగ్ ధార్ సెక్టార్లో ప్రస్తుతం మహిళా సైన్యం విధులు నిర్వర్తిస్తోంది. 30 మంది మహిళా సైనికులు కెప్టెన్ గుర్సిమ్రాన్ నేతృత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కెప్టెన్ గుర్సిమ్రాన్ కుటుంబం మూడు తరాలుగా సైన్యంలోనే సేవలందిస్తోంది. ప్రస్తుతం ఆమె వారి కుటుంబంలో మూడవ తరం సైనిక అధికారి.
జమ్మూకాశ్మీర్లో తొలిసారిగా విధుల్లో ఉన్న రైఫిల్ విమెన్ .. స్థానికులకు భరోసా
సైన్యంలో మహిళలు శాశ్వత హోదాల్లో పని చేయవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జమ్మూకాశ్మీర్లో తొలిసారిగా విధుల్లో ఉన్న రైఫిల్ విమెన్ కొద్ది రోజుల్లోనే స్థానిక ప్రజల పై సానుకూల ప్రభావాన్ని చూపించగలిగారు. సాధన పాస్ ద్వారా దేశంలోకి నార్కోటిక్స్, ఆయుధాల స్మగ్లింగ్ మరియు నకిలీ కరెన్సీని అడ్డుకోవడం కోసం ఈ రైఫిల్ విమెన్ పనిచేయనున్నారు .
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు దగ్గరలో మహిళా సైన్యం విధులు కత్తిమీద సామే !!
వీరు పని చేస్తున్న ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు అత్యంత చేరువగా ఉండటంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా భారత్ లోకి చొరబడే ప్రమాదం ఉంటుంది. వారిని కూడా సమర్థంగా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో 40 గ్రామాల ప్రజలు కశ్మీర్లోకి వెళ్లేందుకు సాధనా పాస్ మీదుగా వెళ్లాల్సిన క్రమంలో వీరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయడం కోసం, ఈ గ్రామాల నుంచి వచ్చే మహిళలు ఉన్న వాహనాలను తనిఖీ చేయడం కోసం రైఫిల్ విమెన్ సేవలను భారత సైన్యం వినియోగించుకోనుంది.