బాబోయ్ ఇలా చదివేస్తున్నారేంటి: ఐసీఎస్ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు వంద శాతం మార్కులు
న్యూఢిల్లీ: మే నెలలో విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి 10 వ తరగతి ఫలితాలు విడుదల కాగా మంగళవారం ఐసీఎస్ఈ (ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్) బోర్డు ఫలితాలు వెలువడ్డాయి. ఐసీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు 100శాతం మార్కులను స్కోరు చేశారు. ఐసీఎస్ఈ చరిత్రలోనే ఇలా ఇద్దరు విద్యార్థులు వంద శాతం మార్కులు స్కోరు చేయడం తొలిసారి కావడం విశేషం.
రికార్డులను తుడిచేసిన విద్యార్థులు
రికార్డులు ఉన్నదే తుడిచిపెట్టేందుకు అనే మాటను ఈ ఇద్దరు విద్యార్థులు మరోసారి రుజువు చేశారు. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో బెంగళూరుకు చెందిన విభా స్వామినాథన్, కోల్కతాకు చెందిన దేవాంగ్ కుమార్ అగర్వాల్లు 100శాతం మార్కులతో టాపర్స్గా నిలిచి ఒకప్పుడు ఉన్న అన్ని రికార్డులను తిరగరాశారు. విభా స్వామినాథన్ మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూలులో చదవగా... దేవాంగ్ కుమార్ అగర్వాల్ లామారిటినీర్ ఫర్ బాయ్స్ కోల్కతాలో చదివాడు. నాలుగు రోజుల క్రితం సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో 12వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు 500 మార్కులకు గాను ఒక్క మార్కు కోల్పోయి 499 మార్కులతో సీబీఎస్ఈ టాపర్స్గా నిలిచారు.
మార్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
ఇక ఐఎస్సీ టాపర్లు మరో ప్రపంచంలో ఉన్నారని సీఐఎస్సీఈ సెక్రెటరీ, సీఈఓ గెరి ఆరథూన్ చెప్పారు. ఇది ఒక సరికొత్త రికార్డు అని వెల్లడించారు.విద్యార్థులు కష్టపడి చదవడం వల్లే ఈ వండర్ సాధ్యమైందని ఆయన అన్నారు. ఇక సీబీఎస్ఈ బోర్డులో విద్యార్థులు ఎలాగైతే టాపర్స్గా నిలిచారో... ఐసీఎస్ఈ బోర్డులో కూడా 16 మంది రెండో స్థానంలో నిలువగా.. 36 మంది విద్యార్థులు మూడోస్థానంలో నిలిచారు. 100శాతం మార్కులను విద్యార్థులు సాధిస్తుండటంతో విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు వంద శాతం మార్కులు వస్తున్నాయంటే క్వశ్చన్ పేపర్ సరిగ్గా సెట్ చేయడం లేదో లేక మూల్యాంకణ సరిగ్గా ఉండటం లేదనో భావించాల్సి వస్తోందని ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్ తెలిపారు.
ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.05 శాతం బాలికలు పాస్ అయ్యారు. బాలురు 98.12 శాతం మంది పాస్ అయ్యారు. ఇక 12 వ తరగతిలో అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ 97.84 ఉండగా... అబ్బాయిల పాస్ శాతం 95.40గా ఉంది. పదవ తరగతి ఫలితాల్లో ముంబైకి చెందిన జూహీ రూపేష్ ఖజారియా, ముక్తసర్కు చెందిన మన్హర్ బన్సాల్లు 99.60 శాతం మార్కులు సాధించి తొలిస్థానంలో నిలిచారు.రెండో స్థానంలో 99.40 శాతం మార్కులతో 10 మంది విద్యార్థులు నిలువగా.. మూడో స్థానంలో 99.20 శాతం మార్కులు సాధించి 24 మంది నిలిచారు.