బెంగళూరులో 16 వేల సీసీటీవీ కెమెరాలు.. మహిళలు ఇక ‘నిర్భయం’గా
Array
బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళల భద్రత కోసం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిర్బయ ఫండ్ లో భాగంగా బెంగళూరు నగరంలో 16,000 వేల క్లోజ్ డ్ సర్య్కూట్ టెలివిజన్స్ (సీసీటీవీ) కెమెరాలు ఏర్పాటు చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక న్యాయ, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి జేసీ. మధుస్వామి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నగరంలో అదనంగా 16,000 వేల సీసీకెమెరాలు ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు.
నిర్బయ ఫండ్
మహిళలకు మరింత భద్రత కట్టుదిట్టం చెయ్యడానికి పోలీసులు జీఐఎస్ మ్యాప్ తయారు చేస్తున్నారని, వాటి ఆధారంగా నగరంలో అదనంగా 16,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే నిర్బయ ఫండ్ కింద గత మూడు సంవత్సరాల్లో సేఫ్ సిటి ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు నగరంలో రూ. 667 కోట్ల నిధులు సద్వినియోగం అయ్యాయని మంత్రి జేసీ. మధుస్వామి వివరించారు.
పక్క పోలీస్ స్టేషన్ కు సిగ్నల్
ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ఎమర్జెన్సీ లైట్, పానిక్ బటన్, లౌడ్ స్పీకర్ సైరన్ తో సమీపంలోని పోలీస్ స్టేషన్ సమాచారం అందేలా ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మధుస్వామి వివరించారు.
సీసీసీ సెంటర్
ఆపదలో ఉన్న మహిళల గురించి వెంటనే సమాచారం అందుకోవడానికి ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (CCC) ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మధుస్వామి చెప్పారు. బెంగళూరు నగరంలో మహిళలు స్వేచ్చగా, ఏలాంటి భయం లేకుండా సంచరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మధుస్వామి చెప్పారు.
16 వేలు సీసీటీవీ కెమెరాలు
బెంగళూరు నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పించడానికి ఇప్పుడు ఉన్న సీసీ కెమెరాలు కాకుండా అదనంగా 16,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న సీసీటీవీ కెమెరాలకు అత్యాధునిక టెక్నాలజీతో చాల ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి మధుస్వామి అన్నారు.
ప్రత్యేక టెక్నాలజీ
పగలు, రాత్రి ముఖాలు స్పష్టంగా కనపడే 7,500 సీసీటీవీ కెమెరాలు, 5,000 ఫిక్సెడ్ సీసీటీవీ కెమెరాలు, 1,000 పాన్ టిల్జ్ జూమ్ కెమెరాలు, 1,000 ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ సీసీటీవీ కెమెరాలు, 500 ముఖాలు స్పష్టంగా గుర్తించే సీసీటీవీ కెమెరాలు, 20 డ్రోన్ లతో ప్రత్యేకంగా నిఘా వేసే సీసీటీవీ కెమెరాలు, 1,100 అత్యాధునిక బాడీ వార్న్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మధుస్వామి వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో ఈ ప్రత్యేక ప్యాకేజ్ కు నిధులు మంజూరు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 40:60 శాతం నిధులు కేటాయిస్తోంది. మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించే ప్రాజెక్టు కింద బెంగళూరు నగరంతో పాటు ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై. హైదరాబాద్, అహమ్మదాబాద్, లక్నోలో ఈ ప్రాజక్ట్ అమలు చేస్తున్నారు.