ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మోడీ: పుతిన్ తర్వాతే ట్రంప్
ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో తొలి 10 మందిలో చోటు దక్కించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులో ఆయన 9వ స్థానంలో నిలవటం విశేషం.
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా మరో ఘనతను సాధించారు. ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో తొలి 10 మందిలో చోటు దక్కించుకున్నారు. ఇందులో ఆయన 9వ స్థానంలో నిలవటం విశేషం.
మొత్తం 74 మంది అత్యంత శక్తిమంతులతో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా నాలుగో సంవత్సరం ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 130 కోట్ల జనాభా గల భారత్లో మోడీ అత్యంత ప్రజాదరణ గల నేతగా కొనసాగుతున్నారని ఫోర్బ్స్ పేర్కొంది.
అవినీతి, అక్రమ డబ్బు చలామణీని తగ్గించటానికి ఇటీవల మోడీ హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్నీ ప్రస్తావించింది. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మూడో స్థానంలో నిలవగా.. జిన్పింగ్ నాలుగో స్థానం దక్కించుకున్నారు.
కాగా, పోప్ ఫ్రాన్సిస్ (5), మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (7), ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ (10), యాపిల్ సీఈవో టిమ్ కుక్ (32), ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ (43), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (48), ఐసిస్ నేత అబూ బకర్ అల్ బాగ్దాదీ (57) స్థానాల్లో ఉన్నారు.
మేధావుల జాబితాలో సుష్మ
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు. ఆమె ప్రపంచ మేధావుల జాబితాలో స్థానం పొందారు. 'ది ఫారిన్ పాలసీ' పత్రిక 2016 ఏడాదికిగానూ మంగళవారం ప్రకటించిన 100 మంది ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో సుష్మ పేరు కూడా ఉండటం గర్వకారణం.
ఇదే జాబితాలో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ నినీత్ నాయర్-అనుపమ దంపతులకు కూడా చోటు దక్కింది. విధాన రూపకల్పనల విభాగంలో ఎంపికైన సుష్మ 'కామన్ ట్వీపుల్(ట్విటర్) నాయకురాలు' అని 'ది ఫారిన్ పాలసీ' పత్రిక పేర్కొంది.