సంక్షోభం సమయంలో ఇంటి అద్దె చెల్లించాల్సిందేనా..? జస్టిస్ ప్రతిభా సింగ్ చెప్పిన చట్టాలేంటి..?
ఢిల్లీ: ఈ ఏడాది మార్చి నుంచి కరోనావైరస్ సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. మార్చి నెలలో కేంద్రం లాక్డౌన్ విధించిన తర్వాత ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అద్దె వసూలు చేయరాదని సూచించడంతో చాలామంది ఇంటి యజమానులు కిరాయిదారుల నుంచి ఇంటి అద్దెను కూడా వసూలు చేయలేదు. ఇక ఇలాంటి సమయంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ వెబ్నార్ ద్వారా పలు ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు.
కరోనా కష్ట సమయాల్లో చాలామంది పలు ఆలోచనలు చేశారు. ఈ విలువైన సమయాన్ని కుటుంబంతో గడిపారు. ఎన్నో ఆలోచనలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా కేవలం ఇబ్బందులను గురించి మాత్రమే చర్చించుకుందామని జస్టిస్ సింగ్ అన్నారు. చాలామంది ఇళ్ల అద్దె ఎలా కట్టాలో ఆలోచన చేశారు. మదన పడ్డారు. ఈ సమయంలో ఇంటి యజమాని మరియు కిరాయిదారుడు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు జస్టిస్ సింగ్. ఇక సంక్షోభం సమయంలో అద్దె చెల్లింపులు తప్పకుండా చేయాలని ఏమీ లేదని అది చట్టం చెబుతోందని జస్టిస్ ప్రతిభా సింగ్ చెప్పారు. ఇక షాపింగ్ మాల్స్లో దుకాణాలను లీజు కింద చాలామంది తీసుకుని ఉంటారు. అయితే ఒప్పందం కుదుర్చుకునే సమయంలోనే ఫోర్స్ మెజ్యూర్ అనే క్లాస్ గురించి రాసుకోవాలని జస్టిస్ ప్రతిభా సింగ్ చెప్పారు. ఒకవేళ ఈ క్లాస్ లేకుంటే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. ఒక వేళ నోటిమాటతో ఉంటే అందుకు ఏమీ చేయలేమని చెప్పిన జస్టిస్ సింగ్.. సంక్షోభం కారణంగా అద్దెకున్న వ్యక్తి కి ఉద్యోగం ఉంటే అద్దె చెల్లించాలని చెప్పారు.
భారత ఒప్పందం చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం దేశంలో సంక్షోభం వస్తే ఆ సంక్షోభం పూర్తిగా తొలిగిపోయే వరకు అద్దెలు చెల్లించక్కర్లేదని ఆమె చెప్పారు. అద్దెలు చెల్లించాలని యజమాని కూడా బలవంతం లేదా ఒత్తిడి చేయరాదని చెప్పారు. ఈ సమయంలో చేసుకున్న ఒప్పందం చెల్లదని జస్టిస్ ప్రతిభా సింగ్ స్పష్టం చేశారు. ఈ సమయంలోనే కిరాయిదారుడు అదే ఇంట్లో ఉంటూ ఫోర్స్ మెజ్యూర్ క్లాస్ను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇక వాణిజ్య సముదాయాల విషయానికొస్తే ఒక కోర్టు ఆర్డర్ను గుర్తు చేశారు జస్టిస్ ప్రతిభా సింగ్. సంక్షోభం సమయంలో వాణిజ్య సముదాయంలో దుకాణం అద్దెకు తీసుకుని దాన్ని వినియోగించకపోయినప్పటికీ దానికి అద్దె చెల్లించాల్సి ఉంటుందని కోర్టు చెప్పినట్లు గుర్తుచేశారు. అంటే ఆ దుకాణం యజమానికి పూర్తిగా అప్పచెప్పాలని లేదంటే అద్దె చెల్లించాల్సిందేననే కోర్టు తీర్పు జస్టిస్ ప్రతిభా సింగ్ గుర్తు చేశారు.