చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది, ప్రాణాలు కోల్పోయిన 4గురు జవాన్లు
శ్రీనగర్: చనిపోయినట్లుగా నటించిన ఓ టెర్రరిస్ట్.. భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం వచ్చింది భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
దీనిని గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది లోనికి వెళ్లారు. అదే సమయంలో ఓ టెర్రరిస్ట్ చనిపోయినట్లుగా నటించాడు. భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు, ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్కౌంటర్ జరిగే ప్రదేశానికి సమీపంలో ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
సరిహద్దుల్లో కాల్పులు
భారత్ - పాకిస్తాన్ బార్డర్లో దాయాది పాక్ కవ్వింపు చర్యలు ఆపడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్, బాలాకోట్, కృష్ణఘాటి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.