పెళ్లి వేదికను మార్చండి..రాష్ట్రపతి వస్తున్నారు: షాక్కు గురైన విదేశీ జంట
ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఒక పెళ్లి జరిపించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. అయితే కేరళలో ఓ విదేశీ జంటకు చేదు అనుభవం ఎదురైంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా వివాహ వేదికను మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులు చెప్పడంతో వారు షాక్కు గురయ్యారు. అసలు వివాహ వేదికను మార్చుకోవాల్సిందిగా అధికారులు ఎందుకు చెప్పారు..?
వివాహ వేదికగా ఫైవ్ స్టార్ హోటల్
వివాహం అనేది ఎంతో ఘనమైనది. అదో జీవితాంతం గుర్తుండి పోయే వేడుక. అలాంటిది కేరళలోని కొచ్చి ప్రభుత్వ అధికారులు ఈ జంటకు గుర్తుండిపోయేలా చేశారు. కానీ మరోలా అది గుర్తిండిపోతుంది. ఎందుకంటే అధికారులు తమ వివాహ వేడుకను మార్చుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఇక అసలు విషయానికొస్తే అమెరికా నివాసి అయిన ఆష్లే హాల్ తన వివాహంను భారత్లోని కొచ్చిలో చేసుకోవాలని భావించింది. ఇందుకోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్ను బుక్ చేసుకుంది. డబ్బులు కూడా కట్టేసింది. ఇక బంధువులందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇచ్చింది. అందులో వివాహ వేదికగా ఈ ఫైవ్ స్టార్ హోటల్ పేరును ప్రింట్ చేయించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
రాష్ట్రపతి వస్తున్నారని...
కొచ్చికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తున్న నేపథ్యంలో తన వివాహ వేదికను మరో చోటికి మార్చుకోవాలని ఆష్లే హాల్కు అధికారులు సూచించారు. రామ్నాథ్ కోవింద్ అదే హోటల్లో బస చేస్తున్న కారణంగా భద్రతాపరమైన కారణాలతో వేదికను మార్చుకోవాలని అధికారులు చెప్పినట్లు ఆష్లే తెలిపారు. వేదికను మార్చుకునేందకు అధికారులు 48 గంటల సమయం ఇచ్చారు. ఇక చేసేదేమీ లేక ఆష్లే రాష్ట్రపతి భవన్ వర్గాలకు ట్వీట్ చేసింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది.
8 నెలల క్రితమే డిస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్
ఇక తన వివాహ వేదికను 8 నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నట్లు ఆష్లే చెప్పారు. ఇందుకోసం వేదికగా కొచ్చిలోని తాజ్ వివాంటా హోటల్ను బుక్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక అదేరోజున రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా వస్తుండటంతో ఆ వేదికను మార్చాలని భద్రతాధికారులు సూచించారు. చాలా ఇబ్బందిగా మారడంతో రాష్ట్రపతి భవన్కు ఆమె ట్వీట్ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి సమాచారం లేనప్పటికీ వివాహ వేదికను మార్చడం కష్టం కాబట్టి రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందే తన పర్యటనను ఒక్కరోజు వాయిదా వేసుకున్నారు. దీంతో ఆష్లే ఊపిరి పీల్చుకుంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపింది.
ఇబ్బందికి సారీ.. విషెస్ చెప్పిన రాష్ట్రపతి
ఎప్పుడో ప్లాన్ చేసుకున్న వివాహ వేదికను కదలించడం భావ్యం కాదని భావించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన పర్యటనను ఒక్కరోజు వాయిదా వేసుకున్నారు. అంతేకాదు కొత్త దంపతులకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు చెప్పిన రామ్నాథ్ కోవింద్... వివాహం చక్కగా జరిగిందని భావిస్తూ ఆష్లే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.