రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు, సిద్దూతో భేటీ, ఆపరేషన్ కమల, రిసార్టుకు ఎమ్మెల్యేలు!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారడంతో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్యతో పలువురు నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. బెంగళూరులోని కావేరీలోని సిద్దరామయ్య నివాసానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు అందర్నీ వెంటనే రిసార్టుకు తరలించాలని చర్చలు జరిగాయని సమాచారం.
సర్వే దెబ్బ: కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై 35 శాతం, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని!
12 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వేకువ జామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సిద్దరామయ్యకు స్వాగతం పలికారు.
నాకేం తెలీదు
బెంగళూరు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల గురించి తనకు ఏమీ తెలీదని, అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత మాట్లాడుతానని అన్నారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించిన తరువాత పూర్తి వివరాలు చెబుతానని సిద్దరామయ్య తెలిపారు.
సుధీర్ఘ చర్చలు
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోని కావేరీలోని సిద్దరామయ్య నివాసంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, కేసీ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే సిద్దరామయ్య ఇంటికి చేరుకుని వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
బెంగళూరుకు ఎమ్మెల్యేలు
సొంత నియోజక వర్గాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే బెంగళూరు రావాలని సిద్దరామయ్య, కేసీ. వేణుగోపాల్, డాక్టర్ జీ. పరమేశ్వర్, దినేష్ గుండూరావ్ తదితరులు సూచించారని తెలిసింది. ఎమ్మెల్యేలు అందరూ బెంగళూరు వచ్చిన వెంటనే రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చెయ్యాలని సిద్దరామయ్య తదితరులు నిర్ణయించారని తెలిసింది.
రిసార్టుకు ఎమ్మెల్యేలు
బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల మొదలు పెట్టారని ప్రచారం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం నిర్వహించి వెంటనే వారిని అక్కడి నుంచి నేరుగా రిసార్టుకు తరలించాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారని సమాచారం.
బీజేపీతో భయం
ఆపరేషన్ కమల పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడ లాక్కొంటారో అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ భయంతో కొన్ని రోజులు పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారని సమాచారం. సిద్దరామయ్య బెంగళూరు రావడంతో వరుసగా ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అవుతున్నారు.