ఢిల్లీ అల్లర్లు : ఐబీ కానిస్టేబుల్ హత్య.. తాహిర్ హుస్సేన్ ఇంట్లో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ టీమ్
ఢిల్లీ అల్లర్లలో ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఇంట్లో శుక్రవారం ఫోరెన్సిక్ టీమ్ తనిఖీలు నిర్వహించారు. చాంద్బాగ్లోని హుస్సేన్ నాలుగంతస్తుల రెసిడెన్షియల్&కమర్షియల్ కాంప్లెక్స్ భవనంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. అనంతరం అంకిత్ శర్మ మృతదేహం లభ్యమైన డ్రైనేజీ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ రక్తపు నమూనాలతో పాటు పలు ఆధారాలను సేకరించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ ఫోరెన్సిక్ టీమ్ పలు ఆధారాలను సేకరించింది.
కాగా,అంకిత్ శర్మ శవపరీక్ష నివేదికలో అతన్ని 400 కన్నా ఎక్కువ సార్లు దారుణంగా పొడిచి చంపారని వెల్లడైంది. అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు తాహిర్ హుస్సేన్ మనుషులే తమవాడిని చంపారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తాహిర్ హుస్సేన్పై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాహిర్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. మరోవైపు అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాహిర్ హుస్సేన్ చెబుతున్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని.. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.త్వరలోనే విచారణ నిమిత్తం తాహిర్ హుస్సేన్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే,ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 148 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 603 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 32 మంది మృతి చెందగా.. 250 పైచిలుకు మంది గాయపడ్డారు. ఏవైనా విద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకుంటే 155260కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.