బీజేపీ టార్గెట్ 2021: తమిళిసై వారసుణ్ని డిసైడ్ చేసిన అమిత్ షా.. దీదీకి పోటీ దిలీపే..
ఎన్నికల పోరాటానికి సంబంధించి గతేడాది బీజేపీకి మిశ్రమ ఫలితాలొచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన ఆ పార్టీ.. తర్వాతి కాలంలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ అధికారం చేపట్టడంలో విఫలమైంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ తప్ప ఆ పార్టీ చేతిలో పెద్ద రాష్ట్రాలేవీ లేవు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆమేరకు ఆయా రాష్ట్రాల పార్టీ ఇన్ చార్జిల నియామకాలపై అమిత్ షా ఫోకస్ పెంచారు.
ఎన్నికల రాష్ట్రాల్లో కీలక నియామకాలు..
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది నవంబర్ లో బిహార్ అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. నితీశ్ తో దోస్తీ కొనసాగించాలా? వద్దా? అనేదానిపై బీజేపీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక 2021లో మాత్రం ఏకంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో కీలకమైన వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పాండిచేరి ఉన్నాయి. టార్గెట్ 2021 పేరుతో ఆ ఎన్నికలను బీజేపీ సవాలుగా తీసుకుంది. ఆ మేరకు కీలక పదవుల్ని భర్తీ చేస్తోంది.
తమిళిసై వారసుడిగా నాగేంద్రన్
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌదరరాజన్ నియామకం జరగడానికి ముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. తమిళిసై రాజీనామాతో ఆ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. తమిళనాడు బీజేపీకి కొత్త చీఫ్ గా నైనార్ నాగేంద్ర పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఖరారు చేసినట్లు తెలిసింది. ఒకటి రెండ్రోజుల్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
దీదీ వర్సెస్ దిలీప్
ఈసారి ఎలాగైనాసరే వెస్ట్ బెంగాల్ లో పాగా వేయాలనుకుంటోన్న బీజేపీ.. ఆ రాష్ట్ర యూనిట్ కు దిలీప్ ఘోష్ నే అధ్యక్షుడిగా కొనసాగించనుంది. ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇవ్వగలరని భావిస్తోన్న ఘోష్.. గురువారం బెంగాల్ బీజేపీ చీఫ్ గా రెండో సారి ఎన్నికయ్యారు. సీఏఏ ఆందోళన కారుల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చేయాలంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని సొంత పార్టీ నేతలే ఖండించిన తర్వాత కూడా దిలీప్ సునాయాసంగా రీఎలక్ట్ కావడం గమనార్హం.
ఓట్ల శాతం పెరిగేలా..
2021లో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో.. వెస్ట్ బెంగాల్ లో అధికారాన్ని కైవసం చేసుకోవడంతోపాటు అస్సాంలో రెండో సారీ పీఠాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీ.. మిగిలిన చోట్ల మాత్రం ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది.