తొలి ముస్లిం: మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి
ముంబై: భారత మాజీ అటార్నీ జనరల్ గులాం ఇ వాహనవతి గుండెపోటుతో మంగళవారం ఇక్కడ కన్ను మూశారు. ఆయనకు 65 ఏళ్లు. అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం అయిన గూలామ్ ఎస్సాజీ వాహనవతికి భార్య, ఒక కుమారుడున్నట్లు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ దారియస్ ఖంబాటా చెప్పారు.
యుపిఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2009లో వాహనవతిని మూడేళ్ల కాలానికి అటార్నీ జనరల్గా నియమించారు. 2012లో ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన గత మే 27న తన పదవికి రాజీనామా చేశారు. అటార్నీ జనరల్గా నియమితులు కావడానికి ముందు వాహనవతి 2004 జూన్ 20నుంచి 2009 జూన్ 7 దాకా సొలిసిటర్ జనరల్గా పని చేసారు.
అంతకు ముందు ఆయన మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. 1949 మే 7న జన్మించిన వాహనవతి సెయింట్ జేవియర్ కాలేజి నుంచి గ్రాడ్యుయేషన్, ముంబైలోని ప్రభుత్వ లా కాలేజినుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు.