రాష్ట్రపతి రేసు: ప్రతిపక్షాల అభ్యర్థిగా.. మహాత్మా గాంధీ మనవడు!
రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పట
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు. ప్రతిపక్ష నేతలు తనతో మాట్లాడారని, అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని గోపాలకృష్ణ గాంధీ వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పటికే గాంధీతో మాట్లాడినట్లు సమాచారం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు.
మరోవైపు ఎన్డీయే ప్రభుత్వ అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. అయితే ప్రతిపక్షాల తరఫు అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పేరు కూడా వినిపిస్తున్నది.
మహాత్మాగాంధీ చిన్న కుమారుడైన దేవదాస్ గాంధీ నలుగురు కుమారుల్లో గోపాలకృష్ణ గాంధీ ఒకరు. 1945, ఏప్రిల్ 22న ఆయన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
1968లో ఐఏఎస్లో చేరిన ఆయన.. తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు. 1987 నుంచి 1992 వరకు భారత రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఐఏఎస్ నుంచి 1992లో గోపాలకృష్ణగాంధీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 1996లో సౌతాఫ్రికాలో భారత హైకమిషనర్గా పనిచేశారు. 1997లో రాష్ట్రపతికి కార్యదర్శిగా నియమితులయ్యారు.