22న అసెంబ్లీ: కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం: ప్రొటెం స్పీకర్గా మాజీ ముఖ్యమంత్రి
పాట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కొత్త అసెంబ్లీ కొలువుదీరబోతోంది. ఈ నెల 23వ తేదీన బిహార్ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల కోసం మరోసారి నోటిఫికేషన్ వెలువడుతుందని తెలుస్తోంది. మలిదశ సమావేశాల సమయంలోనే స్పీకర్ను ఎన్నుకొంటారని అంటున్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా అధినేత జీతన్ రామ్ మాంఝీ ప్రొటెం స్పీకర్గా నియమితులు అయ్యారు. కొద్దిసేపటి కిందట ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా గవర్నర్ ఫగు చౌహాన్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 23, 24 తేదీల్లో మాంఝీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారని గవర్నర్ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రొటెం స్పీకర్ హోదాలో జీతర్ రామ్ మాంఝీ.. శాసనసభలో కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం సభ వాయిదా పడుతుందని సమాచారం. పూర్తిస్థాయి శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. స్పీకర్గా జీతన్ రామ్ మాంఝీకే అవకాశం దక్కొచ్చంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హిందుస్తానీ ఆవామ్ మోర్చా ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఇమామ్ గంజ్ నుంచి ఆయన విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినెట్లో చేరలేదు. ఆయన పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ పరిణామాల మధ్య జీతన్ రామ్ మాంఝీకే స్పీకర్ పదవి దక్కొచ్చంటూ ఇదివరకు ఊహాగానాలు చెలరేగాయి. అనుభవజ్ఙడైన సభ్యుడు కావడం వల్ల ఆయనను స్పీకర్గా ఎన్నుకుంటారని అంటున్నారు.