ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు వేశాడు - జేడీయూలోకి బీహార్ మాజీ డీజీపీ - వీఆర్ఎస్ తీసుకున్న మూడ్రోజులకే
గుప్తేశ్వరవ్ పాండే.. గత రెండు నెలలుగా సంచలనంగా మారిన పేరిది. ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటూ మరో రాష్ట్ర పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. నటుడు సుశాంగ్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులను ఉద్దేశించి బీహార్ పోలీస్ బాస్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివాదం కొనసాగుతుండగానే.. సడెన్ గా వాలంటరీ రిటైర్మెట్ ప్రకటించిన ఆయన.. అందరూ ఊహించినట్లే రాజకీయాల్లో చేరారు.
ఎన్నికల వేళ.. బీహార్ వివాదాస్పద మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమక్షంలో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీలో చేరారు. సీఎం నివాసానికి వచ్చిన పాండేకు కండువా కప్పిన నితీశ్.. పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ''నేను సాధారణ కార్యకర్తగా జేడీయూలో చేరాను. పార్టీ చీఫ్ నితీశ్ నిర్దేశించే ఎలాంటి పనయినా చేస్తాను''అని పాండే మీడియాతో అన్నారు.
తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలతోపాటే వాల్మికినగర్ లోక్ సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగనుంది. జేడీయూలో చేరిన మాజీ డీజీపీ పాండేను వాల్మికి నగర్ స్థానం నుంచి బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆయన మాత్రం సొంత జిల్లా బక్సర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఇంకొందరు చెప్పారు. దీనిపై నితీశ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్పీపీ - మణిపూర్లో మళ్లీ హైడ్రామా
సుశాంత్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులపై విమర్శలు చేసిన పాండే.. ఈనెల 23న వీఆర్ఎస్ ప్రకటించారు. 'ఇక నేను స్వేచ్ఛా జీవిని ఏదైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు' అని రిటైర్మెంట్ సమయంలో పాండే వ్యాఖ్యానించారు. శనివారం సీఎం నితీశ్ ను కలిసిన సందర్భంలోనూ తాను రాజకీయాల్లో చేరడంలేదన్న పాండే.. 24 గంటలు తిరిగేలోపే కండువా కప్పేసుకోవడం గమనార్హం. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.