మోడీని చూసి స్ఫూర్తి: మాజీ సైనికులకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాదపూజ
రాయచూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్నటికి మొన్న ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అయిదుమంది పారిశుద్ధ్య కార్మికులకు కాళ్లు కడిగి, పాదపూజ చేశారు. మోడీని చూసి స్ఫూర్తి పొందినట్టున్నారు ఆయన పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు. తాను కూడా కాళ్లు కడగడానికి పూనుకున్నారు. మోడీ తరహాలో కొందరు మాజీ సైనికులకు పాదపూజ చేశారు.
పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు, వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చెర నుంచి వీడబోతుండటం వంటి వరుస సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆ మాజీ ఎమ్మెల్యే తన పుట్టినరోజు నాడు 15 మంది పదవీ విరమణ చేసిన సైనికులకు పాదపూజ చేశారు. ఆయన పేరు తిప్పరాజు హవల్దార్. కర్ణాటకలోని రాయచూరు గ్రామీణ స్థానం నుంచి గతంలో బీజేపీ తరఫున అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు.
శుక్రవారం ఆయన పుట్టినరోజు. ప్రస్తుతం దేశమంతా వైమానిక దళ దాడులు, అభినందన్ గురించే మాట్లాడుతుండటాన్ని గ్రహించిన ఆయన సైనికుల త్యాగాలను గుర్తిస్తూ వారికి పాదపూజ చేశారు. రాయచూరులోని ఐడీఎస్ లే అవుట్ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి 15 మంది మాజీ సైనికులను ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. వారికి శాలువాలు కప్పి, సన్మానం చేశారు. అనంతరం వారి కాళ్లు కడిగి, పాదపూజ చేశారు.
దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు చురకలు అంటిస్తున్నారు. గురువు తగ్గ శిష్యుడంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. మోడీ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి, దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశారని, ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అదే పని చేసి ప్రజల దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.