సెక్స్ స్కాండల్: విద్యార్థినిపై ఏడాది కాలంగా అత్యాచారం: కటకటాల వెనక్కి బీజేపీ నేత!
లక్నో: ఓ న్యాయ విద్యార్థినిని నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి చిన్మయానంద్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఈ ఉదయం ఆయనను సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అటు పార్టీలో, ఇటు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో కలకలం పుట్టించింది. బాధతురాలికి న్యాయం జరిగిందంటూ బీజేపీ నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వారిని తమ పార్టీలో స్థానం లేదని చెబుతున్నారు.
న్యాయ కళాశాలకు డైరెక్టర్ గా ఉంటూ..
బాధిత విద్యార్థిని చిన్మయానంద్ కు చెందిన ముముక్షు ఆశ్రమం ఆధర్యంలో నడుస్తోన్న న్యాయ కళాశాలలో చదువుకుంటున్నారు. చిన్మయానంద్ స్వయంగా ఈ కళాశాల బోర్డు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తన కంటికి నచ్చిన విద్యార్థినిని లొంగ దీసుకుని, అత్యాచారం చేయడం చిన్మయానంద్ అలవాటు అంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవే ఆరోపణలు చేస్తూ కిందటి నెల 24వ తేదీన బాధిత విద్యార్థిని అదృశ్యం అయ్యారు. ఏడాదికాలంగా తనపై చిన్మయానంద్ అత్యాచారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ లైవ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత కనిపించకుండా పోయారు. తమ కుమార్తె కనిపించట్లేదని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లైవ్ వీడియోను పోస్ట్ చేసిన తరువాత.. తనను చంపేస్తారనే భయంతో బాధిత విద్యార్థిని రాజస్థాన్ కు వెళ్లిపోయారు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు జోక్యం..
షాజహాన్ పూర్ పోలీసులు చిన్మయానంద్ పై కేసు నమోదు చేశారు. మొదట ఈ కేసు అలహాబాద్ న్యాయస్థానం, ఆ తరువాత సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, మూలాల నుంచి శోధించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయిదుమంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో విభిన్న కోణాల్లో విచారించిన తరువాత చిన్మయానంద్ ను నిందితుడిగా గుర్తించారు అధికారులు. దర్యాప్తులో భాగంగా వారు పలువురు విద్యార్థినులను సంప్రదించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. చిన్మయానంద్ బారిన పలువురు విద్యార్థినులు పడ్డారని తేలింది. వారందరి నుంచీ వాంగ్మూలాన్ని సేకరించారు.
అత్యాచారంపై వీడియో..
అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో వీడియోను చిత్రీకరించే వాడని బాధిత విద్యార్థిని వెల్లడించారు. దాని ఆధారంగా ఏడాదికాలంగా తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే హత్య చేస్తానంటూ బెదిరించారని అన్నారు. చిన్మయానంద్ లైంగిక వేధింపులను భరించలేక తాను లైవ్ వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం చిన్మయానంద్ కు, ఆయన అనుచరులకు దొరకకుండా ఉండటానికి రాజస్థాన్ కు వెళ్లినట్లు ఆమె సిట్ అధికారుల వద్ద వాంగ్మూలం ఇచ్చారు. చిన్మయానంద్ ను అరెస్టు చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ ఉదయం ముముక్షు ఆశ్రమానికి వెళ్లిన అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. చిన్మయానంద్ అరెస్టును ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు. అలాంటి వారికి పార్టీలో చోటు లేదని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఈ కేసులో తమ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ ఏ మాత్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఆయనను ఇదివరకే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.