మంచే జరిగింది... స్వామి అగ్నివేశ్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు...
ఆర్య సమాజ్ నేత,సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్,రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అగ్నివేశ్ మరణం మంచికే జరిగిందని కామెంట్ చేశారు. అగ్నివేశ్ హిందూ వ్యతిరేకి అని,ఆయన వల్ల హిందూయిజానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. 'నువ్వు కాషాయ దుస్తుల్లో ఉన్న హిందూ వ్యతిరేకివి... నీలాంటి వాడు తెలుగు బ్రాహ్మణ కటుంబంలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. అసలు యమరాజు నిన్ను తీసుకెళ్లడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నాడని చింతిస్తున్నాను. నువ్వు గొర్రె వేషంలో ఉన్న సింహానివి... మేకవన్నె పులివి..' అని అగ్నివేశ్పై విరుచుకుపడ్డారు.
నాగేశ్వరరావుపై సర్వత్రా విమర్శలు
స్వామి అగ్నివేశ్పై నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సామాజిక కార్యకర్తలు,రాజకీయ నేతలు,సామాన్యులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పౌర హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు. 'ఓ పోలీస్ అధికారి నుంచి ఇలాంటి ట్వీట్ చూడాల్సి రావడం విచారకరం. అత్యంత అమర్యాదగా,మత పక్షపాతంతో స్వామి అగ్నివేశ్పై విమర్శలు చేశారు. కానీ అగ్నివేశ్ ఓ మహోన్నత వ్యక్తి.' అని హర్ష్ మందర్ వ్యాఖ్యానించారు.
ఆగ్రహించిన ఇర్ఫాన్ హబీబ్...
ప్రముఖ చరిత్రకారుడు ఎస్ ఇర్ఫాన్ హబీబ్ కూడా నాగేశ్వరరావు ట్వీట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నువ్వు సిగ్గుపడాల్సిన వ్యక్తివి. ఒక పోలీస్ అధికారిగా మీరేమీ చేసి ఉంటారో ఊహించగలరా... చనిపోయిన వ్యక్తిని కించపరిచడం హిందుత్వ అవుతుందేమో.. కానీ కచ్చితంగా అది హిందూయిజం అనిపించుకోదు.' అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి చెందిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సైతం నాగేశ్వరరావు వ్యాఖ్యలను తప్పు పట్టింది. నాగేశ్వరరావు ద్వేషపూరిత వ్యాఖ్యలు పోలీస్ యూనిఫామ్కే అవమానమని.... ప్రభుత్వాన్ని కూడా అతను ఇబ్బందిపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు,దేశంలోని యావత్ పోలీస్ వ్యవస్థ నైతికతను ఆయన దెబ్బతీశాడని మండిపడింది.
'విద్వేష వైరస్...'
సామాజిక కార్యకర్త,వ్యాఖ్యాత రాహుల్ ఈశ్వర్ నాగేశ్వరరావు విమర్శలను 'విద్వేష వైరస్'గా అభివర్ణించారు. అయితే నాగేశ్వరరావు మాత్రం తన వ్యాఖ్యలు సమర్థించుకునే ప్రయత్నమే చేశారు. హిందూయిజం ఒక విశ్వాసం కాదని... అదొక ధర్మమని అన్నారు. అంతేకాదు,మీరు అగ్నివేవ్ ఫాలోవరా అని రాహుల్ ఈశ్వర్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా కూడా నాగేశ్వరరావు వ్యాఖ్యలను తప్పు పట్టారు. కాగా,అక్టోబర్ 23,2018న నాగేశ్వరరావు తాత్కాలిక సీబీఐ చీఫ్గా మధ్యంతర బాధ్యతలు చేపట్టి కేవలం 22 రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
You are a disgrace. Can imagine what all you must have done as a police officer? Abusing the dead may be Hindutva but is certainly not Hinduism. Better late than never. Get yourself treated. https://t.co/Shh4zlmduc
— S lrfan Habib (@irfhabib) September 12, 2020