సీబీఐలో కీలక పరిణామాలు: ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా, రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం నాడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా సీబీఐలో ట్విస్ట్ మీద ట్విస్ట్ కొనసాగుతోంది.
ఇప్పుడు అలోక్ వర్మ రాజీనామా చేయడం మరో సంచలనం. గురువారం ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్గా తొలగించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనను పైర్ సర్వీస్ డీజీగా పంపించింది. అలోక్ వర్మ ఆ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ హైకోర్టులో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు శుక్రవారం చుక్కెదురయింది. ఆస్థానా సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని రాకేష్ ఆస్థానా, దేవేంద్ర కుమార్లు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. వీరిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. సీబీఐ విచారణకు పది వారాల గడువు ఇచ్చింది.
మరోసారి బదలీలు రద్దు
సుప్రీం కోర్టు ఆదేశాలతో రెండు రోజుల క్రితం సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ గతంలో తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావు చేసిన బదలీలను నిలిపివేశారు. ఆ తర్వాత హైపవర్ కమిటీ సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగించింది. తిరిగి నాగేశ్వర రావును తాత్కాలిక సీబీఐ డైరెక్టర్గా నియమించింది. దీంతో ఈ తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావు... అలోక్ వర్మ చేసిన బదలీలను మళ్లీ రద్దు చేశారు.