సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం, వీఆర్ఎస్: రాజకీయాల్లోకి.. ఏ పార్టీ వైపు?
ముంబై/అమరావతి/హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా ఉన్న లక్ష్మీనారాయణ స్వచ్చంధ పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఈ మేరకు ఆయన మహారాష్ట్ర డీజీపీకి గురువారం లేఖ రాశారు. ఆయన పదవీకాలం ఇంకా ఉంది. అయినప్పటికీ హఠాత్తుగా వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర కేడర్కు చెందిన జేడీ లక్ష్మీనారాయణ నాడు వైయస్ జగన్, గాలి జనార్ధన్ రెడ్డిల అక్రమాస్తుల కేసు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారా?
లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ తీసుకోవడంతో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన దీనిపై పెదవి విప్పనప్పటికీ ఆయన సన్నిహితులు ఇదే అభిప్రాయంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
జేడీ లక్ష్మీనారాయణ నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే బీజేపీలో చేరుతారని కొందరు, కాదు.. కాదు.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారని కొందరు అంటున్నారు. కొత్త పార్టీ పెడతారా అనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.