కోమాలో మాజీ ముఖ్యమంత్రి: వెంటిలేటర్పై: 48 గంటల తరువాతే: ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందా?
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు గడిచిన తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారణకు రావచ్చని వెల్లడించారు. రాజధాని రాయ్పూర్లో గల శ్రీ నారాయణ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
74 సంవత్సరాల అజిత్ జోగి..రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. పలు హోదాల్లో ఆయన పని చేశారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మధ్యప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన ఛత్తీస్గఢ్కు ఆయనే తొలి ముఖ్యమంత్రి. 2000 నుంచి 2003 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్సభ బరిలోనూ సత్తా చాటారు.
అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీ నుంచి బయటికి వచ్చి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఛత్తీస్గఢ్లో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లను ఢీ కొట్టలేకపోయింది. క్రమంగా రాజకీయాలకు దూరంగా అయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అమిత్ జోగి.. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు.
శనివారం రాత్రి అజిత్ జోగికి తీవ్ర గుండెపోటు రావడంతో రాయ్పూర్లోని శ్రీ నారాయణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం మరింత విషమించింది. దీనితో కోమాలోకి వెళ్లిపోయారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని అన్నారు. 48 గంటలు గడిచిన తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది స్పష్టమౌతుందని అన్నారు. అప్పటిదాకా తామేమీ చేయలేమని డాక్టర్లు చెప్పారు. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీ మనుగడ ఆయనతోనే ముడిపడి ఉందని చెబుతున్నారు.