ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్: మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి అరెస్టయ్యారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో పోలీసులు అతడ్ని మంగళవారం అరెస్ట్ చేశారు.
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 2018, ఫిబ్రవరి 3న అమిత్ జోగిపై సెక్షన్ 420(మోసం) కింద కేసు నమోదు చేశారు. ఎస్టీలకు రిజర్వ్డ్ అయిన మార్వాహి నియోజకవర్గం నుంచి 2013లో పోటీ చేసిన అమిత్ జోగి.. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బీజేపీ నేత సమీర పాక్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమిత్ జోగి తండ్రి అజిత్ జోగీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ ఎస్టీ కాదంటూ తేల్చిన నేపథ్యంలో అమిత్ జోగిపై ఈ కేసు నమోదైంది. తప్పుడు ధృవీకరణ పత్రం సృష్టించినందుకు ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగీపైనా కేసు నమోదు చేశారు.
ఎన్నికల అఫిడవిట్లో తాను ఎస్టీనంటూ తప్పుగా పేర్కొనడంతో అమిత్ జోగిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అమిత్ జోగి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేశారు.
అజిత్ జోగి ఎస్టీ కాదంటూ పలుమార్లు జరిపిన విచారణల్లో కూడా రుజువు కావడం గమనార్హం. ఛత్తీస్గఢ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇతర వెనుకబడిన తరగతుల(రెగ్యూలేషన్ ఆఫ్ సెర్టిఫికేషన్ ఆఫ్ సోషల్ స్టేటస్) రూల్స్ 2013 సెక్షన్ల కింద గురువారం అమిత్ జోగిపై కేసు నమోదు చేసినట్లు బిలాస్పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.