మాజీ సీఎం మోసం చేశారు, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను ఎంత ? రెబల్ !
బెంగళూరు: కర్ణాటకలోని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు చాల మంది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు. తమను మంత్రులు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మోసం చేశారని, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదని, తాను ఎంతని అనర్హతకు గురైన ఎమ్మెల్యే బి.సి. పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం హావేరీలో మీడియాతో మాట్లాడిన హీరేకరూర్ నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే బి.సి. పాటిల్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్యను నమ్ముకుని తాము మోసపోయామని బి.సి. పాటిల్ విమర్శించారు.
బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని, అయితే తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బి.సి.పాటిల్ అన్నారు. చట్టబద్దంగా తమ మీద అనర్హత వేటు పడలేదని బి.సి. పాటిల్ అన్నారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతోందని బి.సి. పాటిల్ ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద తాము ఎంతో నమ్మకం పెట్టుకున్నామని, మంత్రి చేస్తానని మాట ఇచ్చి చివరి నిమిషయంలో ఆయన చేతులు ఎత్తేశారని బి.సి. పాటిల్ ఆరోపించారు. అనర్హతకు గురైన చాల మంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు అని బి.సి. పాటిల్ గుర్తు చేశారు.
సిద్దరామయ్య కులానికి చెందిన ఎమ్మెల్యేలకే ఆయన న్యాయం చెయ్యలేదని, ఇక తనలాంటి వారికి ఏం న్యాయం చేస్తారని, ఆయన నియోజక వర్గం ప్రజలు కూడా ఆయనకు లెక్కలేదని బి.సి. పాటిల్ ఆరోపించారు. హెచ్.డి. కుమారస్వామి కుటుంబ పాలన అంతం అయ్యిందని, ఆయన సీఎంగా ఉంటే మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుటుంబ పాలన చేసినట్లు ఉంటుందని బి.సి. పాటిల్ మండిపడ్డారు.
మాజీ మంత్రులు డీకే. శివకుమార్, డాక్టర్ జీ. పరమేశ్వర్ అధికారంలో ఉన్న సమయంలో ఏ మంత్రికి స్వతంత్రంగా పని చేసే అవకాశం లేదని బి.సి. పాటిల్ ఆరోపించారు. తాను ఏ పార్టీ ప్రలోభాలకు లొంగలేదని, తన తండ్రి సంపాధించిన 10 ఎకరాల భూమి విక్రయించి ఖర్చులు పెట్టుకుంటున్నానని బి,సి. పాటిల్ అన్నారు.