రైతుల స్థితిపై చలించిపోయిన రాహుల్..! కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ చీఫ్..!!
న్యూదిల్లీ/హైదరాబాద్ : దేశంలోని రైతుల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తన నియోజక వర్గం వయనాడ్ (కేరళ)లోని రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో జీరో అవర్ లో ఆయన మాట్లాడారు. 'దేశంలోని రైతుల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి.
వారి పరిస్థితులు బాగుపడేలా చర్యలు తీసుకోవాలని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నాను. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతుల సంక్షేమం కోసం ఎటువంటి ముఖ్యమైన చర్యలూ తీసుకోలేదు' అని తెలిపారు. కేరళలోనూ రైతుల పరిస్థితులు బాగోలేవు. రుణాల వసూలు కోసం రైతులను బ్యాంకులు బెదిరించకుండా కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇందుకు తగ్గట్లు కేరళ ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు.
రుణం తీర్చలేక నిన్న కూడా వయనాడ్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం తీర్చనందుకు ఆ ప్రాంతంలోని 8,000 మంది రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. ఓ చట్టం ప్రకారం బ్యాంకు రుణాలకు రైతుల ఆస్తులను అనుసంధానం చేశారు. ఈ కారణంగానే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
రైతుల సమస్యలకు కాంగ్రెసే కారణమని చెప్పుకొచ్చారు. 'రైతుల దుస్థితికి దశాబ్దాల పాటు దేశంలో ప్రభుత్వాన్ని నడిపినవారే బాధ్యులు. భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతుల ఆత్మహత్యలు ఇప్పటి కన్నా అధికంగా ఉండేవి. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రైతుల ఆదాయం దాదాపు 25 శాతం పెరిగింది' అని వ్యాఖ్యానించారు.