కుప్పకూలిన స్టేజీ : ప్రమాదం నుంచి తప్పించుకున్న మాజీ సీఎం
హైదరాబాద్ : అభిమాన నేతను కలవాలన్న ఆతృతలో.. భారీ సంఖ్యలో కార్యకర్తలు స్టేజీ మీదకు ఎక్కడంతో.. స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదం చోటు చేసుకున్న సందర్బంలో.. స్టేజీపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉండడంతో కొంత కలకలం రేగింది. అయితే అశోక్ గెహ్లాట్ చేతికి చిన్న గాయం మినహా ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాద సమయంలో స్టేజీ మీద 200మంది కార్యకర్తలు ఉన్నట్లు అంచనా. ఎక్కువ మంది కార్యకర్తలు గెహ్లాట్ తో కరచాలనం కోసం ఎగబడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్టేజీపై బరువు ఎక్కువైపోవడంతో.. ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గెహ్లాట్ చేతికి గాయమవడంతో.. తక్షణం స్థానిక కాంగ్రెస్ నేత ఇంటికి తీసుకెళ్లి ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. ఆదివారం నాడు రాజస్తాన్ లోని తోంక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన సభలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.