వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బ
బెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ్యులు నిత్యం సమావేశాలకు రాకపోవడంతో సీఎల్ పీ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెలకు వార్నింగ్ ఇచ్చారు.
ఫిబ్రవరి 8వ తేదీ శుక్రవారం 12.30 గంటలకు ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ భాద్యతలు చూసుకుంటున్న హెచ్.డి. కుమారస్వామి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్దం అయ్యారు. అదే రోజు అంతకు ముందే కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశం నిర్వహించాలని సిద్దరామయ్య నిర్ణయించారు.
బుధవారం జరిగిన శాసన సభ సమావేశాలకు 8 మంది కాంగ్రెస్ శాసన సభ్యలు హాజరుకాలేదు. జనవరి 18వ తేదీ జరిగిన శాసన సభ్యుల సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేది శుక్రవారం జరిగే శాసన సభ్యుల సమావేశానికి 70 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరుకావాలని సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు.
గతంలో జరిగిన సీఎల్ పీ సమావేశాలకు పదేపదే డుమ్మా కొడుతున్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీఎల్ పీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని కాంగ్రెస్ పార్టి నిర్ణయించింది.
బుధవారం జరిగిన శాసన సభ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రమేష్ జారకిహోళి, బి. నాగేంద్ర, మహేష్ కుమటళ్ళి, డాక్టర్ సుధాకర్, బిసి. పాటిల్, రామలింగా రెడ్డి, సౌమ్యా రెడ్డి, జేఎన్. గణేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు అందరూ శుక్రవారం జరిగే సీఎల్ పీ సమావేశానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ కమల భయంతో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నారు.