తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అందుకే పన్నీర్ ఇలా, బీజేపీ లీక్ చేసిందా ?
తమిళనాడులో త్వరలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని, కార్యకర్తలు అందరూ సిద్దంగా ఉండాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బాంబుపేల్చారు. కాంచీపురంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
చెన్నై: తమిళనాడులో త్వరలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని, కార్యకర్తలు అందరూ సిద్దంగా ఉండాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బాంబుపేల్చారు. కాంచీపురంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అమ్మ జయలలితను చూసి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు ఉన్న శశికళ బినామీ ప్రభుత్వాన్ని చూసి చీదరించుకుంటున్నారని పన్నీర్ సెల్వం అన్నారు.
శశికళ భర్త పరుగో పరుగు: అరెస్టు చేస్తారని అజ్ఞాతంలోకి: మన్నార్ గుడి హడల్ !
శశికళ వర్గం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని పన్నీర్ సెల్వం జోస్యం చెప్పారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఒక్క పని జరగడం లేదని పన్నీర్ సెల్వ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలు
తమిళనాడులో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల యంత్రాంగం సిద్దం అయ్యింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని అన్ని పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
పన్నీర్ సెల్వం పర్యటన ?
తమిళనాడులో త్వరలో శాసన సభ ఎన్నికలు వస్తాయని పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద రహస్యమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు సిద్దం అయ్యారని తెలిసింది.
పన్నీర్ సెల్వంకు చాన్స్ ఇవ్వాలని
తమిళనాడులో త్వరలో శాసన సభ ఎన్నికలు జరిగితే పన్నీర్ సెల్వంకు మరో చాన్స్ ఇచ్చి సీఎం చెయ్యాలని అన్నాడీఎంకేలోని ఓ వర్గం నాయకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే జయలలిత చరిష్మా లేకపోవడంతో పన్నీర్ సెల్వం మెజారిటీ సీట్లు సాధించడం అంతసులువు కాదని కార్యకర్తలు అంటున్నారు.
వేచి చూస్తున్న కేంద్రం
తమిళనాడు రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా గమనిస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల నుంచి తమిళనాడు పరిస్థితుల గురించి నివేదికలు తెప్పించుకుంటున్నదని తెలిసింది. అయితే తమిళనాడు విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ఆరోపణలు రావడంతో అక్కడి పెద్దలు అవకాశం కోసం వేచిచూస్తున్నారని సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికలు
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించిన తరువాత అన్నాడీఎంకేలోని ఎంపీల మద్దతు తీసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి అయిన తరువాత కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తమిళనాడు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
ఆరోజు వస్తే అంతే
రాష్ట్రపతి ఎన్నికల తరువాత తమిళనాడులో ఇదే పరిస్థితి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమిళనాడు ప్రజల్లో కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని పెద్దలు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
పన్నీర్ సెల్వంకు లీక్ చేశారు ?
రాష్ట్రపతి ఎన్నికల తరువాత తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కేంద్రంలోని పెద్దలు పన్నీర్ సెల్వం చెవిలో వెయ్యడం వలనే ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారని తెలిసింది. అయితే ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని తమిళనాడులోని బీజేపీ పెద్దలు, పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు అంటున్నారు.