కాంగ్రెస్ మంత్రి, మాజీ మంత్రి వేదిస్తున్నారు, ప్రెస్ మీట్ లో విషం తాగిన మాజీ కార్పొరేటర్ !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేదిస్తున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ నాగరాజ్ అలియాస్ నాగ అలియాస్ బాంబు నాగ విలేకరుల సమావేశంలోనే విషం తాగి ఆసుపత్రిపాలైనాడు. నాగరాజ్ ఆరోగ్యం గురించి ఆయన అనుచరులు ఆసుపత్రి సిబ్బంది దగ్గర ఆరా తీస్తున్నారు.
మంత్రి, మాజీ మంత్రి
శుక్రవారం బెంగళూరు ప్రెస్ క్లబ్ లో మాజీ కార్పొరేటర్ నాగరాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దినేష్ గుండురావ్, బెంగళూరు నగర అభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్ తనను వేదిస్తున్నారని నాగరాజ్ ఆరోపించారు.
నా చావుకు వాళ్లే కారణం
నా చావుకు దినేష్ గుండూరావ్, కేజే. జార్జ్ కారణం, వారి వలన తనకు చాలా అన్యాయం జరిగింది అంటూ వెంటనే జోబులో ఉన్న విషయం బాటిల్ తీసుకుని తాగేశాడు. వెంటనే నాగరాజ్ ను ఆయన అనుచరులు సెయింట్ మారథాస్ ఆసుపత్రికి తరలించారు.
భారీ మొత్తంలో పెద్దనోట్లు
పెద్దనోట్లు రూ. 1,000, రూ. 500 రద్దు అయిన తరువాత బెంగళూరు పోలీసులు శ్రీరాంపురలోని నాగరాజ్ ఇంటిలో భారీ మొత్తంలో రద్దు అయిన పెద్దనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో నాగరాజ్, ఆయన కుమారులు పక్కింటి మేడ మీద నుంచి తప్పించుకుని తమిళనాడు పారిపోయారు.
వేలూరు, జైలు జీవితం
తమిళనాడులోని వేలూరులో తలదాచుకున్న నాగరాజ్, ఆయన కుమారులను పోలీసులు అరెస్టు చేసి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన నాగరాజ్ కాంగ్రెస్ మంత్రి కేజే, జార్జ్, మాజీ మంత్రి దినేష్ గుండూరావ్ మీద ఆరోపణలు చేసి విషం తాగడంతో ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.