కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, సర్వం సిద్దం, డేట్ ఫిక్స్: మాజీ డీసీఎం ఆర్. అశోక్ !
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 10వ తేదీ మొదలు అవుతోంది. గత సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని హుబ్బళిలో ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం చెయ్యడానికి తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.
హుబ్బళిలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 10వ తేదీ హుబ్బళిలోని కుసుగల్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ జరుగుతుందని ఆర్. అశోక్ అన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ధారవాడ, హావేరి, గదగ్, ఉత్తర కన్నడ లోక్ సభ నియోజక వర్గాల కార్యకర్తలు పాల్గోంటారని ఆర్. అశోక్ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కర్ణాటకలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ హాజరౌతారని ఆర్, అశోక్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలు విజయవంతం చెయ్యడానికి ఇప్పటికే 30 కమిటీలు ఏర్పాటు చేశామని ఆర్. అశోక్ వివరించారు.
ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 19వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో బహిరంగ సభలు నిర్వహిస్తారని, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 21 బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో జరిగే బహిరంగ సభలకు హాజరౌతారని ఆర్. అశోక్ వివరించారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో కనీసం 22 నియోజక వర్గాలను కైవసం చేసుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.