కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి... వైరస్ సోకిన 10 రోజులకే..
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషి,మాజీ ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్(70) ఆదివారం(జూలై 30) కరోనాతో మృతి చెందారు. మండోలి జైల్లో శిక్ష అనుభవిస్తున్న యాదవ్కు.. జూన్ 26న కరోనా నిర్దారణ అయింది. జైలు అధికారులు ఆయన్ను మొదట డీడీయూ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత లోక్నాయక్ జయప్రకాష్(LNJP) ఆస్పత్రికి తరలించారు. అయితే యాదవ్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మెరుగైన చికిత్స కోసం జూన్ 30న ఢిల్లీలోని ఆకాష్ హెల్త్ కేర్ ఆస్పత్రికి తరలించారు.
అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. యాదవ్ మృతితో మండోలి జైల్లో కరోనా సోకి మృతి చెందినవారి సంఖ్య 2కి చేరింది. అంతకుముందు కన్వర్ సింగ్ అనే ఖైదీ కరోనా సోకి జైల్లోనే మృతి చెందాడు. అతని మృతదేహానికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. కన్వర్ సింగ్ ఉన్న జైలు నం.14 లోనే మహేంద్ర యాదవ్ కూడా ఉండటంతో... ఆయనతో పాటు మరో 29 మంది ఖైదీలకు కరోనా సోకింది.
జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ మాట్లాడుతూ... కరోనా పరీక్షల్లో మొదట 12 మంది ఖైదీలకు నెగటివ్గా తేలిందన్నారు. వారందరికీ జూన్ 25న మళ్లీ కరోనా టెస్టులు చేసినట్లు తెలిపారు. మరుసటిరోజు మహేంద్ర యాదవ్తో పాటు మరో ఇద్దరికీ వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయిందన్నారు. అదే రోజు యాదవ్ను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
Recommended Video
అదే సమయంలో యాదవ్,మరో ఇద్దరు ఖైదీలు... తమకు కరోనా సోకినందునా బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన యాదవ్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో 2018 డిసెంబర్ నుంచి మండోలి జైలులోని 14వ నెంబర్ బ్యారక్లో శిక్ష అనుభవిస్తున్నాడు.