అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం..హుటాహుటిన ఎయిమ్స్ కు బయలుదేరిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఝాన సంస్థ (ఎయిమ్స్) లో చేరారు. అప్పటి నుంచీ ఆయనను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం. అరుణ్ జైట్లీని వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే- రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హుటాహుటిన ఎయిమ్స్ కు బయలుదేరి వెళ్లారు. అరుణ్ జైట్లీని ఆయన పరామర్శించనున్నారు. ఆయనకు అందిస్తోన్న చికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. కాగా- జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఆరా తీస్తున్నారు. అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. అనారోగ్యం కారణాల వల్ల అరుణ్ జైట్లీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్ర మంత్రివర్గంలో కూడా తనకు చోటు కల్పించవద్దని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
Delhi: President Ram Nath Kovind to visit Former Finance Minister and BJP leader, Arun Jaitely who is admitted at All India Institute of Medical Sciences (AIIMS), today. He was admitted to AIIMS on 9th August due to breathing problems. (file pics) pic.twitter.com/690EQEetb6
— ANI (@ANI) August 16, 2019
సరిగ్గా- ఇవే కారణాలతో విదేశాంగ శాఖ మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ సైతం ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరలేదు. గుండెపోటుకు గురైన సుష్మాస్వరాజ్ ఇటీవలే ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 66 సంవత్సరాల అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోడీ తొలి హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. ఆర్థికశాఖ, రక్షణశాఖ మంత్రివర్గ బాధ్యతలను నిర్వర్తించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో మొన్నటి లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం జైట్లీ అమెరికా వెళ్లారు. డయాలసిస్ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.