కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ నియామకం...
కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు శుక్రవారం(అగస్టు 21) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అశోక్ లవాసా ఈ నెల 31న పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో తాజాగా నియమితులైన రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపడుతారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 క్లాజ్(2) ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషనర్ను నియమించే నిర్ణయాధికారం రాష్ట్రపతి చేతిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.
రాజీవ్ కుమార్ 1984 జార్ఖండ్ కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారి. పబ్లిక్ పాలసీతో పలు రంగాల అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. బీఎస్సీ,ఎల్ఎల్బీతో పాటు పబ్లిక్ పాలసీ&సస్టైనబిలిటీలో మాస్టర్స్ చదివారు. గత ఏడాది జులైలో ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరితో ఆయన పదవీ కాలం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జన్ ధన్ యోజన,ముద్ర లోన్ స్కీమ్ రూపకల్పనలో రాజీవ్ కీలకంగా పనిచేశారు.
కాగా,కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా,ఎలక్షన్ కమిషనర్లుగా అశోక్ లావాసా, సునీల్ చంద్ర కొనసాగుతున్నారు. సునీల్ అరోరా తర్వాత సీనియారిటీ పరంగా చీఫ్ ఎన్నికల కమిషనర్ పదవి అశోక్ లవాసాకి దక్కేది. కానీ ఎన్నికల కమిషన్తో విబేధాల కారణంగా ఆయన ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్నారు. లవాసా రాజీనామాతో సునీల్ చంద్ర రెండో స్థానంలోకి వెళ్లారు. దీంతో సునీల్ అరోరా పదవీ కాలం ముగిశాక చీఫ్ ఎన్నికల కమిషనర్గా సునీల్ చంద్రకు ఆ పదవి దక్కనుంది.
Rajiv Kumar who has been appointed as the Election Commissioner will take charge of office on September 1. https://t.co/IbYOWuRBLe
— ANI (@ANI) August 21, 2020