జయలలితకు ఆ ఐఏఎస్ ను రోశయ్య పరిచయం చేశారంట !
చెన్నై: తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య నుంచి కొన్ని వివరాలు సేకరించడానికి ఐటీ శాఖ అధికారులు సిద్దం అవుతున్నారని సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రభుత్వం మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కేసులో ఐటీ అధికారులు పలు ఆసక్తికర విషయాలు సేకరిస్తున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సీనియర్ ఐఏఎస్ అధికారి పీ. రామ్మోహన్ రావును అప్పటి గవర్నర్ రోశయ్య పరిచయం చేశారని, అందు వలనే ఆయన్ను అమ్మ పర్సనల్ సెక్రటరీ (పీఏ)గా పెట్టుకున్నారని, తరువాత తమిళనాడు సీఎస్ ను చేశారని ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయంపై పూర్తిగా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
రామ్మోహన్ రావు అక్రమ ఆస్తుల వివరాలు సేకరిస్తున్నఐటీ అధికారులు అవసరం అయితే తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యను కలుసుకుని రామ్మోహన్ రావు గురించి వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించండం లేదు.
మరో పక్క రామ్మోహన్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, సన్నిహితుల ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. రామ్మోహన్ రావు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఏమైనా బినామీ ఆస్తులు సంపాదించారా ? అని ఆరా తీస్తున్నారు.