22 ఏళ్ల కిందటి కేసు: మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 1996లోని ఓ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి విచారించారు. అనంతరం అరెస్టు చేశారు.
సంజీవ్ భట్కు వివాదాస్పద అధికారిగా పేరు ఉంది. ఇరవై రెండేళ్ల క్రితం ఓ వ్యక్తిని తప్పుడు డ్రగ్స్ కేసులో ఇరికించడంపై భట్తో పాటు మరో ఏడుగురు పోలీసులను సీఐడీ అరెస్టు చేసింది. ఈ వివరాలను గుజరాత్ సీఐడీ డీజీపీ మీడియాకు తెలిపారు.
1996లో గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో సంజీవ్ భట్ ఎస్పీగా ఉన్నారు. రాజస్థాన్కు చెందిన సుమేర్ సింగ్ రాజ్ పురోహిత్ అనే న్యాయవాదిని సంజీవ్ భట్ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేశారని, అతను బస చేసిన హోటల్ గదిలో ఒక కేజీ బరువు ఉన్న డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
కానీ రాజస్తాన్ పోలీసులు జరిపిన విచారణలో పురోహిత్ను అక్రమంగా కేసులో ఇరికించినట్లు వెల్లడైందన్నారు. ఇందుకోసం అతడిని పోలీసులే కిడ్నాప్ చేసినట్లు రాజస్తాన్ పోలీసులు గుర్తించారని చెప్పారు. దీంతో ఈ ఘటనపై పురోహిత్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు.
ఈ కేసు విచారణను హైకోర్టు గత జూన్ నెలలో సీఐడీకి అప్పగించిందని చెప్పారు. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని చెప్పిందని, దీంతో కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించి సంజీవ్ భట్ సహా ఎనిమిది మంది పోలీసులను అరెస్టు చేశామని చెప్పారు. 2015లో విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న కారణంతో సంజీవ్ భట్ను కేంద్రం సర్వీసుల నుంచి తొలగించింది.
ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సోషల్ మీడియాలో విమర్శలతో భట్ వార్తల్లోకి ఎక్కారు. 2011 ఏప్రిల్లో ఆయన గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.