జైల్లో శశికళ లగ్జరీ లైఫ్; మాజీ హోం మంత్రి చెప్పారని, కాంగ్రెస్ నేతలు ? అందుకే సీఎం !
బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలు చెప్పారని ఆరోపణలు గుప్పుమన్నాయి.
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలు చెప్పారని ఆరోపణలు గుప్పుమన్నాయి. అందుకే డీఐజీ రూపను బదిలి చేశారని ఆరోపిస్తున్నారు.
సెంట్రల్ జైల్లో శశికళ చుడిధార్ వేసుకుని, చేతిలో బ్యాగ్ పట్టుకుని హల్ చల్, ఈ వీడియోలో !
కర్ణాటక హోం శాఖ మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ అండతోనే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చారని, ఏకంగా ఐదు గదులు, ఓ హాల్ కేటాంచారని పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఆర్. అన్బువల్ కుమార్ ఆరోపించారు.
కేపీసీసీ అధ్యక్షుడి హస్తం ?
అన్నాడీఎంకే పార్టీ పన్నీర్ సెల్వం వర్గంలోని ఆ పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి అన్బువల్ కుమార్ నేరుగా కర్ణాటక హోం శాఖ మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆదేశాల మేరకే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని ఆరోపించారు.
శశికళ సన్నిహితుడు
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక శాఖ నాయకుడు పుహలేంది మాజీ హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వరకు అత్యంత సన్నిహితుడని అన్బువల్ కుమార్ ఆరోపించారు. పుహలేంది నిత్యం పరమేశ్వర్ ఇంటి దగ్గరే ఉంటారని ఇదే సందర్బంలో గుర్తు చేశారు.
ఆయన ఒత్తిడితోనే ఇలా జరిగింది
హోం శాఖ మంత్రిగా పని చేసే సమయంలో పరమేశ్వర్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులతో మాట్లాడారని, శశికళకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారని ఆరోపించారు. శశికళ అనుచరుడు పుహలేంది ఒత్తిడి చెయ్యడం వలనే కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ జైలు అధికారులతో మాట్లాడారని అన్బువల్ కుమార్ ఆరోపించారు.
పార్టీ పరువు పోతుందని సీఎం
జైల్లో శశికళకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూసుకోవాలని స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెప్పడం, జైల్లోని అక్రమాలను డీఐజీ రూప బయటి ప్రపంచానికి చెప్పడం వలన కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని సీఎం సిద్దరామయ్య ఐపీఎస్ అధికారుల బదిలీల ముసుగులో రూపను బదిలి చేశారని అన్బువల్ కుమార్ ఆరోపించారు.
కేంద్ర హోం శాఖతో దర్యాప్తు !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాల గురించి విచారణ జరిపించాలని తాను కేంద్ర హోం శాఖ కార్యాలయానికి లేఖ రాస్తానని అన్బువల్ కుమార్ అన్నారు. వెంటనే శశికళను సాదారణ ఖైదీలాగా చూడాలని అన్బువల్ కుమార్ డిమాండ్ చేశారు.
జైలు పక్కనే మన్నార్ గుడి మాఫియా
శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరిన వెంటనే మాన్నార్ గుడి మాఫియా పరప్పన అగ్రహార ఏరియాలో ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి ఇక్కడే మకాం వేశారని, జైల్లో చిన్నమ్మకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా వారే దగ్గర ఉండి చూసుకుంటున్నారని అన్బవల్ కుమార్ ఆరోపించారు.
నాకు ఏమీ తెలీదు: పరమేశ్వర్
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీఐపీ సేవలు చెయ్యాలని తాను ఎవ్వరికి చెప్పలేదని, జైళ్ల శాఖ అధికారులతో తాను అసలు మాట్లాడలేదని, తన మీద వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ అంటున్నారు.
సీఎం చెప్పారు కదా !
ఈ విషయంపై పూర్తి విచారణ చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని, విచారణ జరుగుతోందని, అసలు విషయాలు వెలుగు చూస్తాయని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ అంటున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తన మీద ఆరోపణలు చేస్తున్నారని పరమేశ్వర్ అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దల హస్తం ?
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలీకుండా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చెయ్యడం సాధ్యం కాదని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాలపై కేంద్ర హోం శాఖ అధికారులు విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.