వీడియోకాన్ లోన్ కేసు: ఐసీఐసీఐ మాజీ బాస్ చందా కొచ్చర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐసీఐసీఐ వీడియోకాన్ రుణాల కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఈమెతో పాటు వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్, ఎన్యూపవర్ రెన్యూవబుల్స్ వ్యవస్థాపకుడు దీపక్ కొచ్చర్ పేర్లను కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ముంబైలోని వీడియోకాన్, ఎన్యూ పవర్ కార్యాలయాలతో పాటు పలు చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది సీబీఐ.
ఐసీఐసీఐ బాస్గా చందాకొచ్చర్ ఉన్న సమయంలో వేణుగోపాల్ ధూత్ వీడియోకాన్ గ్రూపునకు రూ.3250 కోట్లు రుణాలు మంజూరు చేసింది. ఇది మంజూరు చేసినందుకు గాను చందాకొచ్చర్ భర్తకు చెందిన ఎన్యూ పవర్ సంస్థలో రూ.64 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఓ షేర్ హోల్డర్ ఆరోపించారు. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబరులో చందా కొచ్చర్ ఐసీఐసీఐ సీఈఓ మరియు ఎండీ పదవికి రాజీనామా చేశారు. ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
చందాకొచ్చర్ రాజీనామా చేయడానికి ముందే సీబీఐ ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసును దర్యాప్తు చేస్తోంది. గతేడాది ఈ కేసుపై ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ ప్రాథమిక విచారణలో బయటపడ్డ కొన్ని విషయాలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు అవడంతో కేసుపై లోతుగా విచారణ జరగనుంది. ఈ కేసులో ఎన్యూ పవర్ రిన్యూవబుల్స్ లిమిటెడ్, సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది సీబీఐ. త్వరలోనే వీరందరికీ సీబీఐ నోటీసులు పంపనున్నట్లు సమాచారం.